
ధాన్యం రైతులకు అండగా పోరాటం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు,
మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు
రాజమహేంద్రవరం సిటీ: ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. మద్దతు ధరకు ధాన్యం కొనకపోవడంతో నష్టపోతున్న రైతులకు అండగా తమ పార్టీ అండగా నిలిచి పోరాడుతుందని చెప్పారు. రాజమహేంద్రవరం ప్రెస్క్లబ్లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బొండాల రకం ధాన్యం కొనకపోవడంతో రైస్ మిల్లర్ల వల్ల రైతులు నష్టపోతున్నారు. రైతు ధాన్యం పట్టుకెళ్తుంటే టార్గెట్ అయిపోయిందంటూ వెనక్కి పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు పండించిన చివరి గింజ వరకూ ప్రభుత్వ మద్దతు ధరకు కూడా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలో రైతులు సంతోషంగా ఉంటే ఇప్పుడు భయపడుతున్నారని, జిల్లా అధికార యంత్రాంగం, ప్రభుత్వం వెంటనే స్పందించాలని అన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్బీకేలు, ఈ–క్రాప్ బుకింగ్లు తీసేశారని విమర్శించారు. చంద్రబాబుతో పాటు కూటమి నాయకులు, పవన్ కల్యాణ్ కూడా బీసీలకు అనేక హామీలు ఇచ్చారన్నారు. మేనిఫెస్టోపై పవన్ కల్యాణ్ కూడా సంతకం చేశారని వేణు గుర్తు చేశారు. 50 సంవత్సరాలు పైబడిన బీసీ కుటుంబాల్లోని వారికి పెన్షన్ మంజూరు చేస్తామంటూ హామీ ఇచ్చారని, అప్పుడే ఏడాది కావస్తోందని, దీనిని అమలు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందంటూ తప్పుడు లెక్కలతో దుష్ప్రచారం చేశారని వేణు దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లో రూ.1.47 లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పారు. పెన్షన్ల మాదిరిగానే మత్స్యకారులకు కూడా మత్స్యకార భరోసా కింద మరో రూ.20 వేల చొప్పున పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనేక కార్యక్రమాలను వదిలేసి, అప్పులు చేసి రాజధాని కట్టాలని మంత్రి నారాయణ అంటున్నారని, అందులో వచ్చే కమీషన్ల కోసం ఆరాటపడుతున్నారని ఆరోపించారు. పోలవరం 2027కు పూర్తయితే మంచిదేనన్నారు. విభజన హామీల్లో పోలవరాన్ని జాతీయ ప్రాజెక్ట్గా కేంద్రం ప్రకటించిందని, కానీ చంద్రబాబు సంపద సృష్టి కోసం దీనిని తీసుకున్నారని వేణు విమర్శించారు.