
రత్నగిరిపై భక్తుల సందడి
● సత్యదేవుని దర్శించిన 30 వేల మంది
● 1,500 వ్రతాల నిర్వహణ
● దేవస్థానానికి
రూ.30 లక్షల ఆదాయం
అన్నవరం: పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం సందడిగా మారింది. విద్యా సంస్థలకు వేసవి సెలవులు కావడంతో అధిక సంఖ్యలో విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆలయానికి వచ్చి, వ్రతాలాచరించి, సత్యదేవుని దర్శించుకున్నారు. స్వామివారి ఉచిత దర్శనానికి గంట, ప్రత్యేక దర్శనానికి అరగంట పట్టింది. సత్యదేవుని దర్శించిన అనంతరం భక్తులు సప్తగోకులంలో గోవులకు ప్రదక్షిణ చేశారు. రావిచెట్టు వద్ద జ్యోతులు వెలిగించారు. మొత్తం 30 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారు. వ్రతాలు 1,500 నిర్వహించారు. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.30 లక్షల ఆదాయం సమకూరింది. నిత్యాన్నదాన పథకంలో సుమారు 5 వేల మంది భక్తులు సత్యదేవుని అన్నప్రసాదం స్వీకరించారు. తిరుచ్చి వాహనంపై సత్యదేవుని ప్రాకార సేవ ఘనంగా నిర్వహించారు.
దుర్గామాతలకు నేడు హోమాలు
చైత్ర మాస అమావాస్యను పురస్కరించుకుని రత్నగిరి వనదుర్గ అమ్మవారికి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ప్రత్యంగిర హోమం నిర్వహించనున్నారు. అలాగే, రత్నగిరి తొలి పావంచా వద్ద కొలువైన కనకదుర్గమ్మ వారి ఆలయంలో ఉదయం 9 గంటల నుంచి చండీహోమం నిర్వహించనున్నారు.