
పోప్ ఫ్రాన్సిస్ మరణం ప్రపంచానికి తీరని లోటు
దేవరపల్లి: రోమన్ కేథలిక్ అత్యున్నత మత గురువు పోప్ ఫ్రాన్సిస్ మరణం ప్రపంచానికి తీరని లోటని ఏలూరు మేత్రాసనం పీఠాధిపతి, విశాఖపట్నం అగ్రపీఠం అపోస్తోలిక పాలనాధికారి మోస్ట్ రెవరెండ్ జయరావు పొలిమెర అన్నారు. విశాఖపట్నం నుంచి మంగళవారం ఏలూరు వెళుతూ మార్గం మధ్యలో గౌరీపట్నం నిర్మలగిరి మేరీ మాత పుణ్యక్షేత్రంలో ఆయన కొద్దిసేపు ఆగారు. పోప్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి బిషప్ జయరావు, పుణ్యక్షేత్రం డైరెక్టర్ రెవరెండ్ ఫాదర్ ఎస్.జాన్పీటర్ పూలమాల వేసి, నివాళులర్పించారు. మరణానికి కొన్ని గంటల ముందు పోప్ ఫ్రాన్సిస్ ఈస్టర్ పర్వదినాన భక్తులకు సందేశం ఇచ్చారని గుర్తు చేశారు. కరుణ, మానవత్వం, ఆధ్యాత్మిక ధైర్యానికి పోప్ ప్రతీక అని అన్నారు. కార్యక్రమంలో పుణ్యక్షేత్రం అన్నధాన ట్రస్ట్ చైర్మన్ కళ్ళే నాగేశ్వరరావు, పలువురు ఫాదర్లు పాల్గొన్నారు.