నన్నయ.. మిన్నయ్యేనా! | - | Sakshi
Sakshi News home page

నన్నయ.. మిన్నయ్యేనా!

Apr 22 2025 12:16 AM | Updated on Apr 22 2025 12:16 AM

నన్నయ.. మిన్నయ్యేనా!

నన్నయ.. మిన్నయ్యేనా!

2006 ఏప్రిల్‌ 22న వర్సిటీ ఏర్పాటు

నేడు 20వ వసంతంలోకి..

పెద్ద వర్సిటీగా గుర్తింపు

ప్రగతికి కలసికట్టుగా పని చేయాలంటున్న వీసీ

నేడు నన్నయ వర్సిటీ ఆవిర్భావ దినోత్సవం

రాజానగరం: తెలుగు రాష్ట్రాలలో అతిపెద్ద యూనివర్సిటీగా విరాజిల్లుతున్న ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఏర్పడి నేటికి 19 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల ప్రజల చిరకాల కోరిక మేరకు అప్పటి మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు కృషితో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి సహకారంతో సాంస్కృతిక, సాహిత్య రాజధానిగా పేరొందిన రాజమహేంద్రవరంలో ఆదికవి నన్నయ పేరిట 2006 ఏప్రిల్‌ 22న ఈ విశ్వవిద్యాలయం ఏర్పడింది. దీని ఆవిర్భావం కోసం గోదావరి జిల్లాల వాసులు, రాజకీయ నాయకులు ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది.

నాక్‌ గుర్తింపు పొందినా..

రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాలలో ఆవిర్భవించిన ఈ యూనివర్సిటీ కొద్ది కాలంలోనే అక్కడి నుంచి వెలుగుబందలో జాతీయ రహదారిని ఆనుకుని సేకరించిన 98 ఎకరాల సువిశాల ప్రాంగణంలోకి అడుగు పెట్టింది. సొంత భవనాలు నిర్మించుకోగలిగింది. 12బితో పాటు నాక్‌ గుర్తింపును కూడా అందుకుంది. కానీ ప్రభుత్వపరంగా సరైన సహకారం లేక విద్యార్థులకు అవసరమైన పూర్తి స్థాయి బోధన సదుపాయాలు పొందలేకపోతోంది. 2018లో చేపట్టిన కొన్ని భవనాల నిర్మాణాలు నిధుల లేమితో నిలిచిపోగా ఇటీవల వీసీగా బాధ్యతలు స్వీకరించిన ఆచార్య ఎస్‌.ప్రసన్నశ్రీ చొరవతో ఆ పనులు పునఃప్రారంభమయ్యాయి.

శాశ్వత అధ్యాపకులేరీ!

యూనివర్సిటీ క్యాంపస్‌లో కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ కామర్స్‌, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌, బీఈడీ కళాశాలలు ఉన్నాయి. వీటితో పాటు కాకినాడ, తాడేపల్లిగూడెంలో రెండు క్యాంపస్‌లు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 390 అనుబంధ కళాశాలలు ఉన్నాయి. తద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద యూనివర్సిటీగా పేరు పొందింది. వర్సిటీ పరిధిలో సుమారు 1.85 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే వర్సిటీ క్యాంపస్‌లో మాత్రం విద్యార్థులకు పాఠాలు బోధించే అధ్యాపకులు పూర్తి స్థాయిలో లేకపోవడం పెద్ద లోటుగా ఉంది. చాలావరకూ అడ్‌హాక్‌, కాంట్రాక్టు అధ్యాపకులతోనే తరగతులు నిర్వహించాల్సి వస్తోంది. ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామంటూనే 19 సంవత్సరాలు పూర్తి చేశారు. ఫలితంగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు.

ఎన్నో వివాదాలు

యూనివర్సిటీలో విద్యార్థినులకు సరైన రక్షణ ఉండటం లేదు. నిరంతరం అభద్రతా భావంతోనే కాలం గడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. ఐదేళ్ల క్రితం ఆంగ్ల విభాగంలో విద్యార్థినుల పట్ల ఒక ఆంగ్లోపాధ్యాయుడి అసభ్య ప్రవర్త వర్సిటీ ప్రతిష్టకు మాయని మచ్చగా మిగిలిపోయింది. ఆ కేసు ఏమైందో తెలియకుండానే మరో హాస్టళ్లలో మత్తు పదార్థాల వివాదం. దీనికి తోడు నాణ్యత లేని, పురుగులు పట్టిన ఆహారం పెడుతున్నారంటూ విద్యార్థులు రోడ్లెక్కిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఆది నుంచీ ఆటుపోట్లే..

ఆది నుంచీ నన్నయ వర్సిటీ అనేక ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉంది. సిబ్బందిలో నెలకొన్న వర్గవైషమ్యాలతో నిత్యం ప్రచార మాధ్యమాలకెక్కుతోంది. సిబ్బందిలో ఏర్పడిన వర్గాలు విద్యార్థులను పావులుగా ఉపయోగించుకుంటున్నాయనే విమర్శలు కూడా ఉన్నాయి. పని చేసే వారికంటే విధులు ఎగ్గొట్టేవారే ఇక్కడ ఎక్కువగా ఉన్నారనే ఆరోపణలు కూడా లేకపోలేదు. రాజకీయ అండదండలతోనే వారు ఇలా వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement