
చంద్రబాబు భూసంతర్పణ పేరిట అక్రమాలు
రాజమహేంద్రవరం రూరల్: చంద్రబాబు అధికారంలోకి వచ్చారంటేనే భూసంతర్పణ పేరిట అక్రమాలు జరుగుతాయని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ విమర్శించారు. పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. విశాఖలో టీసీఎస్కు ఎకరా 99 పైసలకు కేటాయించడాన్ని అడ్డం పెట్టుకుని ఉర్సా కంపెనీకి భూమిని ధారాదత్తం చేస్తూ, కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను పైసలకు అప్పగించే అధికారాన్ని ప్రజలు చంద్రబాబుకు ఇవ్వలేదన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరగాలని అన్నారు. ప్రజలకిచ్చిన హామీలను ఇప్పటి వరకూ నిలబెట్టుకోలేని చంద్రబాబు భూ అక్రమాలకు పాల్పడటం దారుణమని వేణు విమర్శించారు.
నేర నియంత్రణకు డ్రోన్లతో నిఘా
రాజమహేంద్రవరం రూరల్: జిల్లాలో అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, నేరాలు నియంత్రణకు డ్రోన్ కెమెరాలతో నిఘా పెంచనున్నామని జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ తెలిపారు. జిల్లావ్యాప్తంగా నేరాల నియంత్రణకు ఉపయోగిస్తున్న డ్రోన్ కెమెరాల వినియోగంపై జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందికి సోమవారం నిర్వహించిన ప్రత్యేక శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. నేరాలు జరిగేందుకు ఆస్కారమున్న పాడుబడిన ఇళ్లు, తోటలు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, గోదావరి నదీ తీరం వెంబడి డ్రోన్ కెమెరాలతో నిరంతర నిఘా పెడతామని చెప్పారు.
బహిరంగంగా మద్యం తాగడం, గంజాయి వినియోగం, పేకాట నిర్వహణ, ఈవ్ టీజింగ్, చైన్స్నాచింగ్, దొంగతనాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, నేరాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టామని వివరించారు.