అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు | - | Sakshi
Sakshi News home page

అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు

Apr 20 2025 12:17 AM | Updated on Apr 20 2025 12:17 AM

అన్నవ

అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు

పెరవలి: అన్నవరప్పాడులోని వేంకటేశ్వర స్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 4 గంటలకే మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి, ఆలయంలోని తులసి కోట వద్ద దీపాలు వెలింగిచారు. స్వామి వారికి అభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు. స్వామి, అమ్మవార్లను అర్చకులు వివిధ రకాల పూలతో విశేషంగా అలంకరించారు. భక్తులకు ఉదయం ఉచితంగా ప్రసాదాల పంపిణీతో పాటు 10 గంటల నుంచి అన్న సమారాధాన నిర్వహించారు. సుమారు 6 వేల మంది భక్తులు స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. ఆలయంలో ఇటీవల ప్రవేశపెట్టిన నిత్య గోత్ర నామార్చన, శుక్రవారం అభిషేకం, గోత్ర నామార్చనకు, స్వామి వారికి పుష్పాలంకరణ, ప్రసాదం, అన్నదాన విరాళాలకు భక్తుల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోందని చెప్పారు.

ప్రైవేటు స్కూళ్లలో పేదలకు

25 శాతం సీట్లు

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల కేటాయింపు ప్రక్రియ ప్రారంభమైందని జిల్లా పాఠశాల విద్యా శాఖాధికారి కె.వాసుదేవరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యా హక్కు చట్టం ప్రకారం వెనుకబడిన, అనాథ, హెచ్‌ఐవీ బాధిత, దివ్యాంగ, బలహీన, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పిల్లలు ప్రైవేటు, అన్‌ ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం ఉచిత సీట్లు పొందేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని వివరించారు. అనాథ, హెచ్‌ఐవీ బాధితులు, దివ్యాంగులకు 5 శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4 శాతం, బీసీ మైనారిటీలు, ఓసీ పల్లె ప్రాంతాల్లో నివసిస్తూ, వార్షిక ఆదాయం రూ.1.20 లక్షలు మించనివారు, పట్టణ ప్రాంతంలో రూ.1.44 లక్షలు మించని వారికి 6 శాతం చొప్పున సీట్లు కేటాయిస్తారని తెలిపారు. తల్లిదండ్రులు, సంరక్షకులు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూసీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో సమాచార బులెటిన్‌ ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చన్నారు. ఈ నెల 28 నుంచి వచ్చే నెల 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని వాసుదేవరావు సూచించారు.

ఆర్‌ఓబీ పనులు

వేగవంతం చేయాలి

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): నిడదవోలు రైల్వే ఓవర్‌ బ్రిడ్జి (ఆర్‌ఓబీ) నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ పి.ప్రశాంతి ఆదేశించారు. సాంకేతిక నిపుణుల ఆధ్వర్యాన అధికారులతో కూడిన ఎక్స్‌పర్ట్‌ కమిటీ క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహించి, పనులు త్వరితగతిన జరిగేందుకు పరిష్కారం చూపాలని అన్నారు. ఇరిగేషన్‌, రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో తన చాంబర్‌లో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. రూ.10 వేల కోట్లతో నిర్మించనున్న ఈ బ్రిడ్జితో ఎంతో ప్రయోజనం ఉంటుందని అన్నారు. సమన్వయ శాఖలు, సాంకేతిక నిపుణులతో కూడిన అధికారుల బృందం వాస్తవ పరిస్థితిని అంచనా వేసి నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఎర్ర కాలువ వరద ముంపు పరిష్కారంపై అధికారులు ఇచ్చే సూచనలను అనుసరించి జిల్లా మంత్రులతో చర్చించి, ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని కలెక్టర్‌ తెలిపారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.చిన్నరాముడు, కొవ్వూరు ఆర్‌డీఓ రాణి సుస్మిత, ఇరిగేషన్‌ ఎస్‌ఈ కె.గోపీనాథ్‌, ఈఈ ఎం.సుబ్రహ్మణ్యం, ఎర్రకాలువ డీఈ కె.రమేష్‌, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్‌.మాధవరావు పాల్గొన్నారు.

కిటకిటలాడిన తొలి తిరుపతి

పెద్దాపురం: తొలి తిరుపతి గ్రామంలో స్వయంభువుగా వెలసిన శృంగార వల్లభ స్వామి ఆలయం వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో శనివారం కిటకిటలాడింది. సుమారు 15 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. వివిధ సేవలు, కేశఖండన టికెట్లు, అన్నదాన విరాళాలుగా రూ.2,91,596 ఆదాయం సమకూరిందని ఈఓ తెలిపారు.

అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు 1
1/1

అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement