
12 లక్షల టన్నుల ఇసుక సిద్ధంగా ఉంచాలి
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని డీసిల్టేషన్, ఓపెన్ రీచ్లు, సెమీ మెకనైజ్డ్ పాయింట్ల ద్వారా 12 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను 45 రోజుల్లోగా గుర్తించిన స్టాక్ యార్డుల్లో అందుబాటులో ఉంచాలని జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి ఆదేశించారు. ఇసుక సరఫరా విధానంపై సంబంధిత ఏజెన్సీల ప్రతినిధులతో తన క్యాంపు కార్యాలయంలో ఆమె శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్టాక్ యార్డుల నిర్వహణకు ఎవరైనా ముందుకు వస్తే అనుమతి ఇస్తామని చెప్పారు. ఇసుక సరఫరా విధానంపై ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతోందని, ఏదైనా ఏజెన్సీపై ఫిర్యాదులు వస్తే వారే జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. స్టాక్ పాయింట్ నిర్వహణ, అమ్మకాల విషయంలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎస్.చిన్నరాముడు, ఆర్డీఓలు ఆర్.కృష్ణనాయక్, రాణి సుస్మిత, జిల్లా మైన్స్ అధికారి డి.ఫణిభూషణ్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ బీవీ గిరి తదితరులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయుల
రేషియోలో వివక్ష ఎందుకు?
రాజానగరం: ప్రభుత్వ ఏలుబడిలోని పాఠశాలలన్నింటిలో విద్యార్థులు, ఉపాధ్యాయుల రేషియో ఒకేవిధంగా ఉండాలని, కానీ ఉన్నత పాఠశాలకు ఒకలా, ప్రాథమిక పాఠశాలకు మరోలా అమలు చేస్తూ ఎందుకు వివక్ష చూపుతున్నారని ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి త్రినాథ్బాబు అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఉన్నత పాఠశాలల్లోని ప్రాథమిక తరగతుల్లో 10 మంది విద్యార్థులుంటే 2, 11 మంది ఉంటే 3, 31 మంది ఉంటే 4 చొప్పున ఉపాధ్యాయ పోస్టులు మంజూరు చేస్తున్నారని అన్నారు. అదే ప్రాథమిక పాఠశాలలో 20 మంది విద్యార్థులుంటే ఒక్క ఉపాధ్యాయుడినే కేటాయిస్తున్నారన్నారు. ఫౌండేషన్ స్కూల్స్లో 30 మంది విద్యార్థులకు ఒక్క ఉపాధ్యాయుడినే నియమిస్తున్నారని తెలిపారు. మోడల్ ప్రైమరీ స్కూల్లో 59 మందిలోపు విద్యార్థులున్నా నలుగురు ఉపాధ్యాయులుంటున్నారన్నారు. అన్నీ ప్రభుత్వ పాఠశాలలే అయినప్పటికీ ఫౌండేషన్ స్కూల్స్, మోడల్ ప్రైమరీ స్కూల్స్ విషయంలో ఎందుకు వివక్ష చూపుతున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. దీనివలన విద్యా ప్రమాణాల్లో కూడా వ్యత్యాసం వస్తుందనే విషయాన్ని అధికారులు గ్రహించాలని త్రినాథ్బాబు విజ్ఞప్తి చేశారు.
రత్నగిరిపై భక్తుల సందడి
అన్నవరం: వేలాదిగా తరలివచ్చిన భక్తులతో రత్నగిరి శుక్రవారం కిక్కిరిసిపోయింది, సెలవు రోజు కావడంతో సత్యదేవుని దర్శనానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దీనికితోడు గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున రత్నగిరిపై, ఇతర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవదంపతులు, వారి బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో సత్యదేవుని ఆలయానికి తరలి వచ్చారు. ఆలయంలో ఎక్కడ చూసినా నవదంపతులే దర్శనమిచ్చారు. వీరందరూ సత్యదేవుని వ్రతాలాచరించి, స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి ఆలయ ప్రాంగణం, క్యూలైన్లు, వ్రత, విశ్రాంత మండపాలన్నీ నవదంపతులు, వారి బంధుమిత్రులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. సుమారు 40 వేల మంది స్వామివారిని దర్శించి, పూజలు చేశారని అధికారులు తెలిపారు. వ్రతాలు 2 వేలు జరిగాయి. సత్యదేవుని ఉచిత దర్శనానికి గంట, ప్రదక్షిణ దర్శనానికి అరగంట సమయం పట్టింది.అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం వచ్చింది. నిత్యాన్నదాన పథకంలో సత్యదేవుని అన్నప్రసాదాన్ని 5 వేల మంది భక్తులు స్వీకరించారు.
రాష్ట్రస్థాయి యోగా పోటీలకు
‘వివేకానంద’ విద్యార్థులు
అమలాపురం టౌన్: స్థానిక శ్రీస్వామి వివేకానంద యోగాశ్రమంలో శిక్షణ పొందుతున్న ఏడుగురు విద్యార్థులు రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఎంపికై నట్లు ఆశ్రమ యోగా గురువు డాక్టర్ ఆకుల శ్రీనివాస్ తెలిపారు. గత మార్చి 23న పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన యోగా పోటీల్లో తమ విద్యార్థులు టి.పూజిత, బి.సహస్రి, ఆర్.సువర్ణకుమారి, జి.లక్ష్మీ ప్రసన్న, జి.మణికంఠ, ఎన్.రాహుల్, పి.సత్య రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు శ్రీనివాస్ వివరించారు. వీరు ఈ నెల 22న శ్రీకాకుళంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొననున్నారని చెప్పారు.

12 లక్షల టన్నుల ఇసుక సిద్ధంగా ఉంచాలి