
మంత్రులు వనిత, వేణు గోపాలకృష్ణ
కంబాలచెరువు(రాజమహేంద్రవరం): సత్ప్రవర్తనతో ఉన్న ఖైదీల ఉపాధికి సెంట్రల్ జైలులో తీసుకుంటున్న చర్యలను హోం మినిస్టర్ తానేటి వనతి, బీసీ సంక్షేమ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రశంసించారు. జైళ్లశాఖ డీఐజీ కార్యాలయం వెనుక రూ.50 లక్షల వ్యయంతో నిర్మించనునున్న రీజినల్ ట్రైనింగ్ సెంటర్, కోటిపల్లి బస్టాండ్ సమీపంలోని తహసిల్ధార్ కార్యాలయం వద్ద పెట్రోలు బంక్లకు వారు ఎంపీ భరత్రామ్తో కలసి బుధవారం శంకుస్దాపన చేశారు. ఈ సందర్బంగా వనిత మాట్లాడుతూ కోస్తాంధ్ర జైళ్లలో అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా 60 ఎకరాల్లో ట్రైనింగ్ సెంటర్ నిర్మిస్తున్నారన్నారు. నిధులు చాలకపోతే రెండో దశలో మంజూరు చేస్తామన్నారు. ఖైదీలను అర్దం చేసుకునేలా సిబ్బందికి ఇందులో శిక్షణ ఇస్తారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జైళ్ల శాఖలో 17 పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి ఖైదీల ఉపాధికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఖైదీకి రోజుకు రూ.200 వస్తుందని, జైలు నుంచి విడుదలయ్యాక బయట పెట్రోలు బంక్లో పనిచేయడం వల్ల సుమారు నెలకు రూ.12 వేల వరకు సంపాదించవచ్చన్నారు. జైలు శాఖ కార్పస్ నిధులతో ఇండియన్ ఆయిల్, హెచ్పీసీఎల్ సంస్థల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు నిర్వహిస్తామన్నారు. బంక్ ఆదాయం కార్పస్ ఫండ్కు జమ చేయడంతో పాటు జైలు అభివృద్ధికి వినియోగిస్తారన్నారు. మంత్రి శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ఖైదీల జీవనోపాధికి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయటం వల్ల విడుదలయ్యాక మంచి ఉద్యోగం చేసుకోవచ్చునన్నారు. కార్యక్రమంలో డీసీసీబీ ఛైర్మన్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్న్స్(ఏపీ) శ్రీనివాసరావు, కోస్తాంద్ర జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్, జైలు సూపరింటెండెంట్ ఎస్. రాహుల్, జిల్లా ఎస్పీ పి.జగదీష్ తదితరులు పాల్గొన్నారు.