అంబాజీపేట: మాచవరానికి చెందిన పుంగనూరు జాతికి చెందిన ఒక గిత్తను బుధవారం చైన్నెకి తరలించారు. ముందుగా ఈ గ్రామంలోని అడబాల ప్రేమకుమార్కు చెందిన పశువులను, పుంగనూరు గిత్తను నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు చైన్నె విభాగం బుల్ మేనేజ్మెంట్ సీనియర్ అధికారి లిపిదేవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము తీసుకెళుతున్న పుంగనూరు గిత్త నుంచి వీర్యాన్ని సేకరించి, జాతీయ స్థాయిలోని అన్ని సెమన్ బ్యాంకులలో ఉంచుతామన్నారు. ఆయా ప్రాంతాల్లోని రైతుల వద్ద ఉండే పుంగనూరు పశువులకు వీర్యాన్ని ఇంజెక్షన్ రూపంలో ఇస్తామన్నారు. ప్రేమకుమార్ వద్ద ఉన్న పుంగనూరు గిత్త జాతీయ స్థాయిలో మంచి లక్షణాలు కలిగిందిగా ప్రభుత్వం గుర్తించి, రూ.3.75 లక్షలు చెల్లించి కోనుగోలు చేసిందన్నారు. గతంలో ఇక్కడకు వచ్చిన నాలుగు గిత్తల నమూనాలను తీసుకువెళ్లామని, చివరకు ఈ గిత్తను ఎంపిక చేశామన్నారు.


