ఐఎంఏ ఆధ్వర్యంలో వాక్ థాన్
అమలాపురం టౌన్: వైద్యులు, వైద్యాలయాలు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని నినదిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) కోనసీమ శాఖ, అమలాపురం అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో వైద్యులు ఆదివారం వాక్ థాన్ నిర్వహించారు. స్థానిక గడియారం స్తంభం సెంటర్ నుంచి ఈదరపల్లి వంతెన సమీపంలోని కోనసీమ ఐఎంఏ భవనం వరకూ పాద యాత్ర చేపట్టారు. ‘ది ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్ అండ్ గైనకాలజికల్ సొసైటీస్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్వోజీఎస్) ఆధ్వర్యంలో అభయ డేను పురస్కరించుకుని వైద్యులు పలు డిమాండ్లతో కూడిన నినాదాలు ఉన్న ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఈ వాక్ థాన్ను నిర్వహించారు. వైద్యులపై హింసకు వ్యతిరేకంగా ఈ వాక్ థాన్ నిర్వహించినట్లు ఆ శాఖ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శివకుమార్, డాక్టర్ వైటీ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ‘నో టు వయెలెన్స్ ఎగైన్స్ట్ వుమెన్ కమిటీ, వయెలెన్స్ ఎగైన్స్ట్ డాక్టర్స్ కమిటీ, పబ్లిక్ అవేర్నెస్ కమిటీల ప్రతినిధులు ఈ వాక్ థాన్లో పిలుపునిచ్చారు. ఈ పాద యాత్రలో ఐఎంఏ రాష్ట్ర (ఎలెక్ట్) అధ్యక్షుడు డాక్టర్ పీఎస్ శర్మ, సీనియర్ వైద్యులు నిమ్మకాయల రామ్మూర్తి, పయ్యావుల సురేష్బాబు, సీహెచ్ విష్ణుమూర్తి, కె.రమణకుమార్, మాధవి, స్మిత, కావ్య, అనంతలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


