అమలాపురం రూరల్: జిల్లాలో గిడ్డంగుల మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, రైతులకు పంటల బీమా అందేలా క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని, క్వాయర్ పరిశ్రమలను ప్రోత్సహించాలని కలెక్టర్ ఆర్.మహేష్ కుమార్ ఆదేశించారు. శనివారం ఆయన చాంబర్లో మూడు వేర్వేరు సమీక్ష సమావేశాలు నిర్వహించారు.గిడ్డంగుల అభివృద్ధికి అమరావతి కేంద్ర గిడ్డంగుల సంస్థ, మార్కెటింగ్ అధికారులతో సమీక్షించారు. వరి, కోకో, కొబ్బరి ఉత్పత్తులకు డిమాండు పెరుగుతోందని, ఆక్వా కల్చర్ రంగానికి ప్రత్యేక నిల్వ సదుపాయాలు అవసరమన్నారు. సురక్షిత నిల్వతో పాటు రుణ సదుపాయం, రవాణా, పురుగుల నివారణ వంటి అదనపు సేవలు అందించాలని సంస్థకు సూచించారు.
పంటల బీమా ప్రచారం
వ్యవసాయ, ఉద్యాన, బ్యాంకు అధికారులతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వాతావరణ ఆధారిత పంటల బీమాపై సమీక్షించారు. ప్రకృతి వైపరీత్యాల నుండి రైతులను రక్షించడమే లక్ష్యమన్నారు. వరి బీమాకు ఆగస్టు 15, అరటికి జూలై 31 చివరి తేదీలని తెలిపారు.
క్వాయర్ పరిశ్రమకు ప్రోత్సాహం
ఉద్యాన, బ్యాంకు అధికారులతో క్వాయర్ పరిశ్రమలపై సమీక్షించారు. ప్లాస్టిక్కు ప్రత్యామ్నాయంగా తేనెపీచు ఉత్పత్తులను రోడ్లు, నీటిపారుదల శాఖల్లో వాడాలన్నారు. మార్కెటింగ్, సాంకేతికతపై ప్రత్యేక కమిటీలు, కేంద్ర, రాష్ట్ర సబ్సిడీ పథకాలపై అవగాహన, సూక్ష్మ పారిశ్రామికవేత్తల అభివృద్ధి కార్యక్రమం ద్వారా మహిళలకు శిక్షణ, ఎగుమతుల ప్రోత్సాహంపై దృష్టి పెట్టాలన్నారు.
కలెక్టర్ మహేష్ కుమార్


