ఇటువడి.. అటుజడి | - | Sakshi
Sakshi News home page

ఇటువడి.. అటుజడి

Aug 18 2025 12:01 PM | Updated on Aug 18 2025 12:01 PM

ఇటువడ

ఇటువడి.. అటుజడి

కొనసాగుతున్న వర్షం

పెరుగుతున్న వరద

ముంపు బారిన వరి చేలు

లంకల్లో ప్రజలు బిక్కుబిక్కు

ఆగని వానలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో శనివారం అర్ధరాత్రి మొదలైన వర్షం ఆదివారం రాత్రి వరకూ పడుతూనే ఉంది. ఉదయం సమయంలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురవగా, తరువాత వాన కురుస్తూనే ఉంది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ సగటున 11.6 మిల్లీమీటర్ల వర్షం పడింది. అత్యధికంగా ఐ.పోలవరం 20.2, అత్యల్పంగా సఖినేటిపల్లి 5.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా ఇలా.. ఆత్రేయపురం 20, మండపేట 10, రాయవరం 14.6, రామచంద్రపురం 6.8, ఆలమూరు 11.2, రావులపాలెం 15.2, కొత్తపేట 9.2, కపిలేశ్వరపురం 11.6, కె.గంగవరం 7.2, ముమ్మిడివరం 18.2, అయినవిల్లి 10.4, పి.గన్నవరం 8.6, అంబాజీపేట 9.2, రాజోలు 8.8, మలికిపురం 6, మామిడికుదురు 8.4, అల్లవరం 9.6, అమలాపురం 10.2, ఉప్పలగుప్తం 18.8, కాట్రేనికోన 16.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్షాలకు ఉప్పలగుప్తం, అల్లవరం, పి.గన్నవరం మండలాల్లో వరి చేలల్లో పెద్దఎత్తున ముంపునీరు చేరింది.

పొలాలు.. ముంపు ఇక్కట్లు

గత బుధవారం కురిసిన భారీ వర్షానికి తోడు, శనివారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని తీర ప్రాంత మండలాల్లో వరి చేలు నీట మునిగాయి. ఉప్పలగుప్తం, అల్లవరం, ముమ్మిడివరం, కాట్రేనికోన, ఐ.పోలవరం, మామిడికుదురు, మలికిపురం మండలాల్లో చేలు నీట మునిగాయి. చేలల్లో రెండు, మూడు అడుగుల నీరు చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మురుగునీటి కాలువల వ్యవస్థ అధ్వానంగా ఉండడంతో చేలల్లో ముంపునీరు దిగే అవకాశం లేకుండా పోయింది. దీంతో మోటార్లతో డ్రెయిన్లలోకి నీరు తోడుతున్నారు. గంటల పాటు నీరు తోడుతున్నా మరోసారి వర్షం కురిసి చేలు నీట మునుగుతున్నాయని వారు వాపోతున్నారు. తమకన్నా తొలకరి పంట సాగు చేయని రైతుల పరిస్థితి ఉత్తమంగా ఉందని, అనవసరంగా సాగు చేసి నష్టపోతున్నామని చెబుతున్నారు. కొద్దిపాటి వర్షానికే ముంపు తీవ్రత ఇలా ఉంటే ముందు ముందు భారీ వర్షాలు కురిస్తే తొలకరి పంటపై ఆశలు వదులుకోవడమేనని ఆందోళన చెందుతున్నారు.

సాక్షి, అమలాపురం: గోదావరి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో ఒకవైపు గోదావరికి వరద పోటు తగిలింది. మరోవైపు అల్పపీడన ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఒక మోస్తరు వర్షం కురుస్తోంది. వరద.. వర్షంతో ప్రస్తుతానికి ఇబ్బంది లేకున్నా, వీటి ఉధృతి పెరిగితే లంక, కొన్ని మైదాన ప్రాంతాలు ముంపు బారిన పడే ప్రమాదం ఉంది.

గోదావరి ఎగువన కురుస్తున్న వర్షాలకు శనివారం ఉదయం నుంచి రాత్రి వరకూ వరద పెరిగింది. ఆదివారం ఉదయం స్వల్పంగా తగ్గిన వరద మధ్యాహ్నం నుంచి క్రమేపీ పెరుగుతోంది. సోమవారం వరకూ వరద పెరుగుతోందని అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజీ నుంచి శనివారం రాత్రి 4,25,594 క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేశారు. ఆదివారం ఉదయానికి కొంత మేర తగ్గింది. ఉదయం ఆరు గంటల సమయంలో ఽఇది 4,04,890 క్యూసెక్కులకు తగ్గింది. తిరిగి వరద పెరుగుతూ సాయంత్రం ఆరు గంటలకు 4,84,214 క్యూసెక్కులకు చేరింది. ఎగువన భద్రాచలం వద్ద నీటమట్టం పెరుగుతుండడంతో సోమవారం సాయంత్రానికి ఐదు నుంచి ఆరు లక్షల క్యూసెక్కుల మధ్యలో వరద వచ్చి, తరువాత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో క్యాచ్‌మెంట్‌ ఏరియాలో వర్షం పడితే వరద మరింత పెరుగుతోందని అంటున్నారు. శుక్రవారం ఉదయం ఇన్‌ఫ్లో కేవలం 2,29,910 క్యూసెక్కులు మాత్రమే ఉండగా, 24 గంటల వ్యవధిలో 1.74 లక్షల క్యూసెక్కుల వరద పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఫ్లాష్‌ ఫ్లడ్స్‌ వచ్చే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. వరద ప్రభావం నదీపాయల్లో కనిపిస్తోంది. లోతట్టు ప్రాంతాల లంకలను తాకుతూ ప్రవహిస్తోంది. అయితే ప్రతి ఏటా ఆగస్టులో గోదావరిలో నమోదయ్యే సగటు ఇన్‌ఫ్లోతో పోల్చుకుంటే ఇప్పుడు గోదావరికి వచ్చిన వరద అసలు వరద కాదని జలవనరుల శాఖ అధికారులు చెబుతున్నారు.

నీటి విడుదల తగ్గింపు

డెల్టా పంట కాలువలకు నీటి విడుదల తగ్గించారు. ఈ ప్రాంతాల్లో వర్షాలు పడుతుండడంతో ప్రస్తుతం తూర్పు డెల్టాకు 2 వేల క్యూసెక్కులు, మధ్య డెల్టాకు 200, పశ్చిమ డెల్టాకు 500 క్యూసెక్కుల చొప్పున మొత్తం 2,700 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఈ నెల 14న వరకూ 4,550 క్యూసెక్కుల వరకూ నీరు వదలగా వర్షాలతో తగ్గించేశారు.

మరో రెండు అల్పపీడనాలతో..

జిల్లాలో ఆది, సోమవారాల్లో భారీ వర్షం కురుస్తోందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కూడా తెలిపింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రెవెన్యూ పరంగా జిల్లా కలెక్టరేట్‌తో పాటు అమలాపురం, కొత్తపేట, రామచంద్రపురం ఆర్డీఓ కార్యాలయాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేశారు. జిల్లా విద్యుత్‌ శాఖ కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌లు పెట్టారు. ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఉండగానే మరో రెండు అల్పపీడనాలు ఏర్పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తత కొనసాగిస్తోంది.

ఇటువడి.. అటుజడి1
1/2

ఇటువడి.. అటుజడి

ఇటువడి.. అటుజడి2
2/2

ఇటువడి.. అటుజడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement