ఎస్సై కల నెరవేరకుండానే.. | Young Man Died In Road Accident At Nizamabad | Sakshi
Sakshi News home page

ఎస్సై కల నెరవేరకుండానే..

Aug 8 2022 9:46 AM | Updated on Aug 8 2022 9:55 AM

Young Man Died In Road Accident At Nizamabad - Sakshi

మార ఆంజనేయులు

నిజామాబాద్: ఎస్సై కొలువు సాధించాలని ఆ యువకుడు కన్న కలలను విధి కబలించింది. పరీక్ష రాసి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు బలి తీసుకుంది. నిజాంసాగర్‌ మండలం అచ్చంపేటకు చెందిన మార ఆంజనేయులు(30) ఎస్సై ప్రిలిమినరీ పరీక్ష రాసి వస్తుండగా లారీ ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం హైదరాబాద్‌ శివారులోని దుండిగల్‌ వద్ద చోటు చేసుకుంది. అచ్చంపేటకు చెందిన మార అంజవ్వ కుమారుడు ఆంజనేయులు ఎస్సై కావాలన్న పట్టుదలతో హైదరాబాద్‌లో అద్దెకు ఉంటూ చదువుకుంటున్నాడు. ఆదివారం దుండిగల్‌ లక్ష్మారెడ్డి కళాశాలలో ఎస్సై ప్రిలిమినరి పరీక్ష రాశాడు. అనంతరం షాపుర్‌లోని రూమ్‌కు బైక్‌పై వెళ్తుండగా వెనక నుంచి లారీ ఢీకొంది. లారీ టైర్లు ఆంజనేయులు మీద నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి తల్లి అంజవ్వతో పాటు భార్య సారిక, రెండేళ్ల కుమారుడు ఉన్నారు. 

ఇటు పరీక్ష.. అటు సోదరుడి వివాహం 
ఆంజనేయులు చిన్నాన్న కుమారుడి చింటూ పెళ్లి ఆదివారం నిజామాబాద్‌లో జరిగింది. ఎస్సై పరీక్ష రాసిన తర్వాత వివాహానికి హాజరు కావాలని ఆంజనేయులు అనుకున్నాడు. అంతలోనే రూమ్‌కు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. 

Advertisement
 
Advertisement
Advertisement