మహిళ కాళ్లు చేతులు కట్టి పడేసి, చిత్ర హింసలు పెట్టి..
సాక్షి, చెన్నై: సహకార సంఘం కార్యదర్శి సేలం అమ్మాపేటలో హత్యకు గురయ్యారు. సేలం అమ్మపేట బాలాజీ నగర్కు చెందిన బాషా భార్య ఉమై భాను(45) సహకార సంఘం కార్యదర్శి. బాషా సమీపంలో వస్త్ర దుకాణం నడుపుతున్నాడు. శుక్రవారం రాత్రి దుకాణం మూసి వేసి ఇంటికెళ్లి చూడగా, ఉమైభాను దారుణ హత్యకు గురై ఉండడంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఆమె కాళ్లు చేతులు కట్టి పడేసి, చిత్ర హింసలు చేసి హతమార్చినట్టు పోలీసుల విచారణలో తేలింది.
ఆ ఇంట్లో శీతల పానీయాలు తాగినట్టుగా మూడు గ్లాసులు ఉండడంతో ఎవరో తెలిసిన వారే ఈ పని చేసి ఉంటారన్న నిర్ధారణకు పోలీసులు వచ్చారు. దీంతో శనివారం ఉదయం ఆ పరిసరాల్లోని నిఘా నేత్రాల్లోని దృశ్యాల ఆధారంగా నిందితుల్ని పట్టుకునే పనిలో అమ్మాపేట పోలీసులు నిమగ్నమయ్యారు.