విశాఖలో దారుణం.. మహిళను ముక్కలుగా నరికి, డ్రమ్ములో కుక్కి.. ఏడాదిన్నరగా!

Viozag Woman Body Parts Found In A Drum, Suspect Over A Year Old - Sakshi

ఢిల్లీ నడిబొడ్డున శ్రద్ధా వాకర్‌ అనే యువతి హత్య జరిగినప్పటి నుంచి దేశంలో ఎదో ఒకచోట ఇలాంటి సంఘటనలు అనేకం వెలుగు చూస్తున్నాయి. జీవితాంతం కలిసి ఉంటామని నమ్మిన వారే యమపాశంలా మారి అత్యంత క్రూరంగా ప్రాణాలు తీస్తున్నారు. ప్రియుడు, భర్త చేతిలో అనేకమంది మహిళలు అర్థాంతరంగా తనువు చాలిస్తున్నారు. తాజాగా ఒల్లుజలదరించే భయంకర హత్యా ఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లాలో చోటుచేసుకుంది. తాళం వేసి ఉన్న ఇంట్లోని డ్రమ్‌లో కుళ్లిపోయిన స్థితిలో ఓ మహిళ మృతదేహం లభ్యమైంది.

వివరాలు.. మధురవాడ వికలాంగుల కాలనీలో గల కొండపై ఓ ఇంట్లో నివసిస్తున్న కుటుంబం నివిసిస్తూ ఉండేది. కొంతకాలంగా వారి ఆచూకీ లేదు.  ఆ ప్రాంతంలో కూలి పనులు చేసుకునే వారే అధికం. అద్దెకు ఉంటున్న వ్యక్తి భార్య గర్భవతి కావడంతో సరిగా ఆ ఇంట్లో ఉండటం లేదని చెబుతున్నారు. దాదాపు ఏడాదిగా ఇంటికి తాళం వేసి ఉంది. ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతంలో దుర్వాసన వస్తుండటంలో స్థానికులు ఇంటి యాజమానికి సమాచారం అందించారు.

ఆయన వచ్చి తాళం పగలగొట్టి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించాడు. అక్కడే ఉన్న ప్లాస్టిక్‌ డ్రమ్మును కదిపాడు. అందులో నుంచి దుర్వాసన రావడంతో మరికొంత బయటకు తీసి చూడగా మహిళ మృతదేహం ఉన్నట్టు గుర్తించి భయాందోళనకు  గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. విశాఖ నార్త్‌ ఏసీపీ శ్రీనివాసరావు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

మృతదేహం ఉన్న పరిస్థితిని గమనిస్తే.. ఏడాదిన్నర క్రితమే మహిళను హత్య చేసి ముక్కలుగా నరికినట్లు పోలీసులు భావిస్తున్నారు. మహిళను భర్తే హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.  
చదవండి: Hyd: కష్టాలు తొలగిస్తానని నగ్న చిత్రాలు తీసి.. ఆపై వ్యభిచారంలోకి!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top