ఎమ్మెల్యే కారులో రూ.2కోట్లు చోరీ 

Two Crore Cash Stolen From AIADMK MLA car In Tamilnadu - Sakshi

తిరువొత్తియూరు: తిరుచ్చిలో అన్నాడీఎంకే ఎమ్మెల్యే కారులోని రూ.2 కోట్ల నగదుతో పరారైన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. వివరాలు.. తిరుచ్చి–కరూర్‌ రోడ్డులోని బెట్టవాయితలైలో మార్చి 22న రెండు కార్లలో వచ్చిన కొందరు వ్యక్తులు ఘర్షణ పడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి రావడంతో ఒక కారులో వచ్చిన వారు పారిపోయారు. ఎమ్మెల్యే పాసుతో ఉన్న కారులో తనిఖీ చేయగా గోనె సంచిలో రూ.కోటి నగదు కనిపించింది. మద్యం మత్తులో ఉన్న ముసిరికి చెందిన అన్నాడీఎంకే నేతలు రవిచంద్రన్‌(55), సత్యరాజా (43), జయశీల (46), డ్రైవర్‌ కుమార్‌ (36)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారిని విచారణ చేయగా ఎమ్మెల్యేకు చెందిన రూ.2కోట్లను మరో కారులో దిలీప్‌కుమార్‌ (31), ప్రకాష్‌ (31), మణికంఠ (29), శివ అలియాస్‌ గుణశేఖరన్‌ (30), రాజ్‌కుమార్‌ (30), సురేష్‌ తీసుకుని పారిపోయినట్లు తెలిపారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా ఆ నగదును తిరుచ్చికి చెందిన రౌడీ షీటర్‌ స్వామి రవి అపహరించుకుని వెళ్లినట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి రవి కోసం గాలిస్తున్నారు.
చదవండి: ప్రాణాలు తీసిన పుచ్చకాయ!

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top