ఏసీబీ అధికారుల‌ను బుకాయించే ప్ర‌య‌త్నం

Trial Of Medak Additional Collector Nagesh Case Continued 2nd day - Sakshi

సాక్షి, మెదక్‌ :  మెదక్ అడిషనల్ కలెక్టర్ నగేష్ బినామీలపై రెండోరోజు విచార‌ణ కొన‌సాగింది. రూ. కోటి పన్నెండు లక్షల వ్యవహారానికి సంబంధించి ఏసీబీ క‌స్ట‌డీలోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో న‌గేష్ ఆస్తుల‌కు సంబంధించి ముగ్గురు బినామీల‌ను ఏసీబీ అధికారులు విచారించారు. ఇందులో ఓ మ‌హిళ కీల‌క పాత్ర పోషించిన‌ట్లు స‌మాచారం. మెదక్, మనోహర బాద్, మేడ్చల్ ,కామారెడ్డిలో  న‌గేష్ పలు అక్రమ ఆస్తుల‌ను కూడ‌బెట్టిన‌ట్లు   ఏసీబీ గుర్తించింది. మెదక్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు కింది స్థాయి ఉద్యోగులను  సైతం  విచారించింది. న‌గేష్ భార్య పేరు మీద ఉన్న బ్యాంక్ లాక‌ర్ కీ కోసం బ్యాంక్ అధికారులతో మరో డూప్లికేట్ కీ ని ఏసీబీ అధికారులు సిద్ధం చేస్తున్నారు. లాక‌ర్ తెరిస్తే మ‌రిన్ని వివ‌రాలు వెలుగులోకి వ‌స్తాయ‌ని  అధికారులు భావిస్తున్నారు.  (బ్యాంకు లాక‌ర్‌పై స్ప‌ష్ట‌త‌నివ్వ‌ని న‌గేష్)

అయితే ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేద‌ని ఏసీబీ విచార‌ణ‌లో అడిషనల్ కలెక్టర్ నగేష్ వెల్ల‌డించారు.  కలెక్టర్ల ప్రమోషన్ లిస్ట్‌లో  ఉన్న నేను అవినీతికి ఎందుకు పాల్పడుతానని ఎసిబిని బుకాయించిన‌ట్లుగా తెలుస్తోంది. దీంతో ఆడియో టేపులు ,అగ్రీమెంట్ పేపర్స్ ,ఆస్తి పత్రాలను  ముందుంచి నగేష్‌ను ప్ర‌శ్నించారు. అడిషనల్ కలెక్టర్ నగేష్‌తో  పాటు మిగిలిన ముగ్గురు నిందితులు  మ‌రో మూడు  రోజుల పాటు ఏసీబీ ఆధీనంలోనే ఉండనున్నారు. రేపు ప‌లువురు అనుమానితుల‌ను ,  సాక్ష్యులను ఏసీబీ విచారించ‌నుంది. నర్సాపూర్‌ మండలం చిప్పల్‌తుర్తి గ్రామంలో 112 ఎకరాలకు ఎన్‌ఓసీ కోసం అడిషనల్‌ కలెక్టర్‌ గడ్డం నగేష్‌ 1.12 ​కోట్ల రూపాయలు డిమాండ్‌ చేసి కటకటాలపాలైన విషయం తెలిసిందే. (అడిషనల్‌ దందా’పై నగేశ్‌ మౌనం)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top