డబ్బులివ్వలేదని తల్లిపై హాకీస్టిక్‌తో దాడి | Son Attacked His Mother With Hockey Stick In Hanamkonda | Sakshi
Sakshi News home page

డబ్బులివ్వలేదని తల్లిపై హాకీస్టిక్‌తో దాడి

Apr 3 2022 3:09 AM | Updated on Apr 3 2022 5:27 AM

Son Attacked His Mother With Hockey Stick In Hanamkonda - Sakshi

రమ్య

హసన్‌పర్తి: డబ్బులు ఇవ్వనందుకు ఓ కుమారుడు హాకీ కర్రతో తల్లిపై దాడి చేశాడు. గొడవను నివారించడానికి వచ్చిన మరో ఇద్దరిని చితకబాదాడు. ఈ సంఘటనలో తల్లి చికిత్స పొందుతూ మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని హనుమాన్‌నగర్‌లో శనివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

గుండ్లసింగారానికి చెందిన అప్పల రమ్య (45) కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తూ హనుమాన్‌నగర్‌లో నివాసం ఉంటోంది. వ్యక్తిగత అవసరం కోసం కుమారుడు రోహిత్‌ రోజూ డబ్బుల కోసం తల్లిని వేధిస్తున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల కిందట డబ్బుల కోసం తల్లితో గొడవ పడ్డాడు. లేవని చెప్పడంతో క్షణికావేశానికి గురైన రోహిత్‌.. హాకీ కర్రతో తల్లి కడుపు, తల, వీపుపై బలంగా కొట్టాడు.

అడ్డువచ్చిన మామ సతీశ్, అమ్మమ్మ, అక్కలను చితకబాదాడు. ఈ ఘటనలో రమ్యకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఎంజీఎంకు తరలించగా శుక్రవారం రాత్రి ఆమె మృతిచెందినట్లు పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ జనార్దన్‌రెడ్డి తెలిపారు. శనివారం మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగిం చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు జనార్దన్‌రెడ్డి చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement