దివ్యది హత్యే.. తేల్చిన పోలీసులు | Police Will File Chargesheet In Divya Murder Case | Sakshi
Sakshi News home page

దివ్యది హత్యే.. తేల్చిన పోలీసులు

Oct 24 2020 9:25 AM | Updated on Oct 24 2020 12:04 PM

Police Will File Chargesheet In Divya Murder Case - Sakshi

సాక్షి, విజయవాడ : ప్రేమోన్మాది చేతిలో ప్రాణాలు కోల్పోయిన విజయవాడ ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసు విచారణ పూర్తి అయ్యింది. దివ్యది హత్యేనని పోలీసులు నిర్ధారించారు. పోస్టుమార్టం రిపోర్టు, ఫోరెన్సిక్‌ నివేదికల ఆధారంగా హత్యగా తేల్చారు. దివ్య ఒంటిపై గుర్తించిన కత్తిపోట్లు తనకు తానుగా చేసుకున్నవి కాదని, నిందితుడు నాగేంద్రనే హత్య చేసినట్లు నిర్ధారించారు. దీనికి సంబంధించి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను కూడా సేకరించారు. తమ ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపకపోవడంతో ఇద్దరం ఆత్మహత్యాయత్నం చేశామని, దివ్యను తాను హత్య చేయలేదని నిందితుడు నాగేంద్ర పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం తప్పని తేల్చారు. కేసుకు సంబంధించి దిశా పోలీసులు ఈనెల 28న ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసే అవకాశం ఉంది. (సీఎం జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు)

అలాగే ఆసుపత్రి నుంచి నిందితుడు నాగేంద్ర డిశ్చార్జి కాగానే అదుపులోకి తీసుకొని విచారించి మరికొన్ని విషయాలను రాబట్టనున్నారు. మరోవైపు ఇరువురి మధ్య జరిగిన ఫోన్‌ సంభాషణ బయటకు లీక్‌ కావడంతో వాటి ఆధారంగా విచారణ చేస్తున్నారు. కాగా నగరంలోని క్రీస్తురాజపురం కొండ ప్రాంతానికి చెందిన వంకాయలపాటి దివ్య తేజశ్విని (22) పై బుడిగి నాగేంద్రబాబు (25) అలియాస్‌ చిన్నస్వామి కత్తితో దాడిచేసి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాధిత కుటుంబ సభ్యులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో పాటు హోంమంత్రి సుచరిత పలువురు మంత్రులు పరామర్శించారు. వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement