దమ్మాయిగూడ అత్యాచార కేసులో పురోగతి | Police Have Progress In Dammaiguda Girl Molestation Case | Sakshi
Sakshi News home page

దమ్మాయిగూడ అత్యాచార కేసులో పురోగతి

Jul 10 2021 10:20 AM | Updated on Jul 10 2021 11:22 AM

Police Have Progress In Dammaiguda Girl Molestation Case - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, జవహర్‌నగర్‌: మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలో చిన్నారి అత్యాచార ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన నిందితుడు ఒరిస్సాకు చెందిన 40 సంవత్సరాల వ్యక్తిగా జవహర్‌ నగర్‌ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను బండ్లగూడలో నివాసం ఉంటున్నట్లు తెలిపారు. భార్యతో తరచూ గొడవల కారణం కొంతకాలం నుంచి భార్యతో దూరంగా ఉంటున్నాడని పేర్కొన్నారు. జవహర్‌నగర్‌ సీఏ బిక్షపతి రావు, కీసర సీఐ నరేందర్ గౌడ్ జాయింట్ ఆపరేషన్‌లో నిందితుడిని పట్టుకున్నట్లు వెల్లడించారు.  ప్రస్తుతం అతను పోలీసు అదుపులో ఉన్నట్లు పేర్కొన్నారు.

కాగా ఇటీవల దమ్మాయిగూడలో నాలుగేళ్ల చిన్నారిపై గుర్తుతెలియని దుండగులు అత్యంత పాశవికంగా హత్యాచారయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శుక్రవారం ఘటన జరిగిన దమ్మాయిగూడ పరిసర ప్రాంతాలను జల్లెడ పట్టారు. మరోవైపు ప్రతిపక్షాలు, ప్రజాసంఘాల నేతలు నిందితులను కఠినంగా శిక్షించాలని ధర్నాలు నిర్వహిస్తుండటం, ఎమ్మెల్యే సీతక్క నిలోఫర్‌ ఆస్పత్రిలో చిన్నారిని చూసేందుకు వెళ్లడం, వెంటనే నిందితులను శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయడంతో ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement