ఉలిక్కిపడిన మంచిర్యాల.. యువకుడి దారుణ హత్య.. ఇదీ జరిగింది! | Mancherial Indaram Incident Tension Situations Here The Full Story | Sakshi
Sakshi News home page

ఉలిక్కిపడిన మంచిర్యాల.. యువకుడి దారుణ హత్య.. ఇదీ జరిగింది!

Apr 25 2023 7:00 PM | Updated on Apr 25 2023 8:54 PM

Mancherial Indaram Incident Tension Situations Here The Full Story - Sakshi

మంచిర్యాల జిల్లా ఇందారంలో ఉద్రిక్తత నెలకొంది. హత్యకు గురైన మహేష్‌ మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. కనకయ్య కుటుంబానికి పోలీసులు మద్దతు ఇవ్వడం వల్లనే ఈ దారుణం జరిగిందని ఆరోపించారు. పోలీసుల వైఫల్యం వల్లే కొడుకు హత్య జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. లేకుంటే ఆందోళన విరమించేది లేదని పట్టుబట్టారు.
(సభలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే బూతు పురాణం.. ముక్కున వేలేసుకున్న కార్యకర్తలు)

పోలీసుల భారీ బందోబస్తు
మహేష్‌ బంధువుల ఆందోళన నేపథ్యంలో స్థానికంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యువకుడి హత్య కేసులో ప్రమేయమున్న వారిపై చర్యలు తీసుకుంటామని జైపూర్‌ ఏసీపీ నరేందర్‌ హామీ ఇవ్వడంతో ఎట్టకేలకు మహేష్‌ బంధవులు ఆందోళన విరమించారు. మృతదేహాన్ని అంత్యక్రియల కోసం శ్మశానవాటికకు తరలించారు.
(ఎంత తొక్కాలని ప్రయత్నిస్తే అంత పైకి వస్తా: వైఎస్‌ షర్మిల)

అయిదుగురిపై కేసు
మరోవైపు యువకుడి హత్య కేసులో అయిదుగురిపై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. కనకయ్యతోపాటు అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేశారు. కాగా ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని జైపూర్‌ మండలంలో ఇందారంలో మహేష్‌ అనే యువకుడిని కత్తులతో దాడి చేసి, బండరాళ్లతో మోదీ హత్య చేసిన ఉదంతం తెలిసిందే. పట్టపగలు అందరూ చూస్తుండగానే బాధితురాలి కుటుంబ సభ్యులు అత్యంత కిరాతకంగా అతడిని అంతమొందించారు.  ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో సంచలనంగా మారింది.

ఇదీ జరిగింది..
ఇందారం గ్రామానికి చెందిన కనకయ్యకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తెతో ఎం. మహేశ్‌(24) అనే యువకుడు ప్రేమ వ్యవహారం సాగించాడు. గతేడాది యువతి తల్లిదండ్రులు మరో వ్యక్తితో ఆమెకు వివాహం జరిపించారు. పైళ్లైనా కూడా మహేష్‌ను వివాహితను వదిలిపెట్టలేదు. యువతిపై కక్ష పెంచుకొని.. ఆమెతో సన్నిహితంగా ఉన్న వీడియోలను తన భర్తకు పంపాడు. ఈ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఈ క్రమంలో ఆరునెలల క్రితం యువతి భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.

అప్పటి నుంచి యువతి తన పుట్టింటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. భర్త చనిపోయినా కూడా మహేష్‌ వేధింపులు ఆపలేదు. దీంతో యువతి తల్లిదండ్రులు యువకుడిపై జైపూర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇరువర్గాలను పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. పలుమార్లు యువతిని మహేష్‌ వేధిస్తూ వచ్చాడు.  కూతురు కాపురం విచ్చిన్నం చేసి.. అల్లుడు మృతికి కారణమైన మహేష్‌పై  కనకయ్య పగ తీర్చుకోవాలనుకున్నాడు. యువకుడి ప్రాణం తీసేందుకు పథకం రచించాడు.

ఈ క్రమంలో ఇంటిముందు బైక్‌పై వెళ్తున్న మహేష్‌పై  కనకయ్య, ఆయన కుటుంబ సభ్యులు  ఆయుధాలతో  దాడి చేశారు. దీంతో అతడు కిందపడిపోవడంతో  కనకయ్య, ఆయన బార్య, కూతురు, కుమారుడు బండరాళ్లతో  మోదీ, కత్తితో పొడిచి ప్రాణాలు తీశారు. అయితే ఇంత దారుణం జరుగుతున్నా అడ్డుకోవడానికి స్థానికులెవరూ ప్రయత్నించకపోవడం గమనార్హం. హత్య దృశ్యాలను కొందరు ఫోన్‌లో రికార్డ్‌ చేశారు. ఈ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఘటనాస్థలాన్ని ఏసీపీ నరేందర్‌, ఎస్సై రామకృష్ణ పరిశీలించారు. 
(దొంగ తెలివి! పని మనిషిగా చేరిన 24 గంటల్లోనే దోపిడీ.. ఎప్పటిలా మళ్లీ సిటీకి)

Advertisement
 
Advertisement
Advertisement