కోడిని కొనే నెపంతో ఇంట్లోకి ప్రవేశించి మైనర్‌ బాలికపై లైంగికదాడి | Man Molested On Alone Minor Girl Vizianagaram | Sakshi
Sakshi News home page

కోడిని కొనే నెపంతో ఇంట్లోకి ప్రవేశించి మైనర్‌ బాలికపై లైంగికదాడి

Jan 7 2022 10:37 AM | Updated on Jan 7 2022 10:49 AM

Man Molested On Alone Minor Girl Vizianagaram - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,శృంగవరపుకోట రూరల్‌(విజయనగరం): ఎస్‌.కోట మండలంలో కోడిని కొనే నెపంతో ఇంట్లో చొరబడిన  ఓ దుండగుడు 10వ తరగతి చదువుతున్న బాలికపై లైంగిక దాడికి బుధవారం రాత్రి పాల్పడ్డాడు.  దీంతో అదే రోజు రాత్రి గ్రామపెద్దలతో కలిసి బాలిక తల్లిదండ్రులు ఎస్‌.కోట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సంఘటనకు సంబంధించి గురువారం తెలిసిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఒక గ్రామానికి చెందిన రైతు దగ్గర ఓ వ్యక్తి రైతరికం కోసం చేరాడు. భార్య, 10వ తరగతి చదువుతున్న కూతురితో కలిసి ఉంటున్న ఆ వ్యక్తి కోళ్లను పెంచి అమ్ముతూ ఉంటాడు. అయితే రైతరికం చేస్తున్న వ్యక్తి..కుమార్తెను ఇంటి వద్దనే ఉంచి భార్యతో కలిసి పనిమీద శృంగవరపుకోట పట్టణానికి బుధవారం వచ్చారు.

అదే సమయంలో గంట్యాడ మండలం, బోనంగి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కోళ్ల కోసం వచ్చి బేరమాడే పనిలో ఉంటూనే బాలికను మంచినీళ్లు ఇమ్మని అడిగాడు. ఇంట్లో ఎవరూ లేరని నిర్ధారించుకున్న ఆ వ్యక్తి నీళ్లు తెచ్చేందుకు ఇంట్లోకి వెళ్లిన బాలికపై లైంగికదాడికి ఒడిగట్టాడు. ఆ సమయంలో బాలిక పెద్దగా కేకలు వేసినప్పటికీ వారిల్లు ఊరికి దూరంగా ఉండడంతో ఎవరికీ వినిపించలేదు. బాలికపై లైంగికదాడికి పాల్పడిన దుండగుడు అనంతరం పారిపోయాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక జరిగిన ఘోరం చెప్పగా గ్రామపెద్దలతో కలిసి   పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు లైంగికదాడికి  పాల్పడిన నిందితుడిని గురువారం వేకువజామున అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా ఈ కేసు విషయమై సీఐ సింహాద్రినాయుడితో మాట్లాడగా త్వరలోనే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించనున్నట్లు స్పష్టం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement