ప్రియుడితో గొడవ.. ఆ నీళ్లు తాగితే బాధ మర్చిపోతావ్‌! | Man Cheats Woman Over Amnesia Water In China | Sakshi
Sakshi News home page

ప్రియుడితో గొడవ.. ఆ నీళ్లు తాగితే బాధ మర్చిపోతావ్‌!

Jun 17 2021 10:48 AM | Updated on Jun 17 2021 10:57 AM

Man Cheats Woman Over Amnesia Water In China - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

బీజింగ్‌ : ‘ఆమ్నీషియా(మతిమరుపు) నీళ్ల’ పేరిట ఓ మహిళను మోసం చేశాడు ఓ సైబర్‌ నేరగాడు. ఈ సంఘటన చైనాలోని జియాంగ్‌షూ ప్రావిన్స్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాలు.. ఈస్ట్‌ చైనా, షూఝౌకు చెందిన కియాన్‌ అనే మహిళ కొద్దిరోజుల క్రితం ప్రియుడితో గొడవపడింది. అతడి జ్ఞాపకాలతో ప్రతీ రోజు నరకం అనుభవించేది. ఎలాగైనా ఆ జ్ఞాపకాలను మర్చిపోవాలనుకునేది. ఇందుకోసం ఏదైనా మందు దొరుకుతుందన్న ఆశతో ఆన్‌లైన్‌లో వెతికింది. ఈ నేపథ్యంలో ఆమెకు ‘ఆమ్నీషియా వాటర్‌’ దర్శనమిచ్చింది. ఆన్‌లైన్‌లో దాని విలువ 500 యాన్‌లు( దాదాపు 5700 రూపాయలు)గా ఉంది. దాన్ని తాగితే బాధపెట్టే జ్ఞాపకాలనుంచి సాంత్వన లభిస్తుందని రాసి ఉంది.

దీంతో ఆమె ఆన్‌లైన్‌లో ఉన్న నెంబర్లకు ఫోన్‌ చేసింది. ఫోన్‌లో మాట్లాడిన వ్యక్తి ‘ఆమ్నీషియా నీళ్లు తాగితే బాధ మర్చిపోతావ్‌!’ అని ఆమెకు చెప్పాడు. మరికొన్ని మాయమాటలు కూడా చెప్పి రూ.6500యాన్‌లు( దాదాపు రూ. 74 వేలు) వసూలు చేశాడు.  అనంతరం ఓ టైం, ప్లేస్‌ చెప్పి.. ఆ సమయానికి ఆ ప్రదేశానికి సదరు మతిమరుపు మందును తీసుకువస్తానని హామీ ఇచ్చాడు. అయితే చెప్పిన టైం దగ్గర పడగానే రాలేనంటూ ఫోన్‌ స్విచ్చాఫ్‌ చేసేశాడు. తాను మోసపోయానని తెలుసుకున్న కియాన్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement