ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడికి జీవిత ఖైదు | Life Imprisonment For Young Man Over Case Of Assassination In Warangal | Sakshi
Sakshi News home page

ప్రియురాలిని హత్య చేసిన ప్రియుడికి జీవిత ఖైదు

Mar 31 2022 11:24 PM | Updated on Mar 31 2022 11:24 PM

Life Imprisonment For Young Man Over Case Of Assassination In Warangal - Sakshi

వరంగల్‌: రెండేళ్ల క్రితం జరిగిన ఓ యువతి హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఆ కేసులో నిందితుడికి బుధవారం జిల్లా కోర్టు జీవిత ఖైదీగా శిక్ష విధించింది. సుబేదారి ఇన్‌స్పెక్టర్‌ రాఘవేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. 7వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.రాధాదేవి తీర్పును వెలువరించారు. కాజిపేట విష్ణుపురికి చెందిన ఎండీ షాహీద్‌ లష్కర్, సింగారంకు చెందిన మునిగాల హారతి హనుమకొండలోని ఓ కళాశాలలో 2016లో బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌ చదివారు. ఆసమయంలో వారిద్దరూ ప్రేమలో పడ్డారు.

కొంత కాలం ప్రేమ సాఫీగానే సాగింది. షాహిద్‌ డిగ్రీ ఫెయిలయ్యాడు. కాజీపేటలోని తన తండ్రికి చెందిన మటన్‌ షాపులో చేదోడుగా ఉండేవాడు. హారతిని కలిసేందుకు ఆమె అక్క నివాసం ఉంటున్న హనుమకొండలోని రాంనగర్‌లో ఓ గదిని అద్దెకు తీసుకున్నాడు. ఈక్రమంలో షాహిద్‌తో హారతి సన్నిహితంగా ఉండడం లేదని, వేరే యువకుడితో సాన్నిహిత్యంగా ఉంటోందనే నెపంతో హారతిని హత్య చేసేందుకు షాహిద్‌ ప్రణాళిక రూపొందించుకున్నాడు. 2020 జనవరి 10న షాహిద్‌ తన గదికి రమ్మని హారతిని పిలిచాడు.

ఆమె రాగానే.. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. షాహిద్‌ హారతిపై అత్యాచారం చేసి కత్తితో గొంతుకోశాడు. కాజీపేట, విష్ణుపురి కాలనీలోని తన ఇంటికెళ్లి రక్తం అంటిన దుస్తులను మార్చుకున్నాడు. సుబేదారి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఏసీపీ జితేందర్‌రెడ్డి సాక్షులను విచారించి నిందితున్ని జైలుకు పంపించారు. 

అధికారులకు అభినందనలు 
బాధితురాలు తరుఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ డి.అజయ్‌కుమార్‌ 29 మంది సాక్షులను కోర్టు ముందు ప్రవేశ పెట్టారు. 7వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి కె.రాధ దేవి నిందితుడికి జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన హనుమకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డిని, కోర్టు కానిస్టేబుల్‌ రాజు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అజయ్‌కుమార్, అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సర్దార్, ప్రాసెస్‌ హోంగార్డు శ్రీధర్‌ను వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌ జోషి అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement