ఇంటర్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి | Intermediate student suicide in hyderabad | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ విద్యార్థి అనుమానాస్పద మృతి

Nov 24 2024 8:03 AM | Updated on Nov 24 2024 8:03 AM

Intermediate student suicide in hyderabad

మియాపూర్‌: మియాపూర్‌ పరిధి మాతృశ్రీనగర్‌ కాలనీలోని ఓ కార్పొరేట్‌ కళాశాలలో ఇంటర్‌ చదువుతున్న  విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. బాధితులు, పోలీసులు తెల్పన మేరకు..షాద్‌నగర్‌కు చెందిన గౌరిశెట్టి శ్రీనివాస్, మాధవి దంపతుల కుమారుడు కౌశిక్‌ రాఘవ (17) ఈ కళాశాలలో ఇంటర్‌ ఎంపీసీ ఫస్టియర్‌ చదువుతూ కళాశాల హాస్టల్‌లో ఉంటున్నాడు. ప్రతి రోజు మాదిరిగానే కౌశిక్‌  శుక్రవారం రాత్రి 10 గంటలకు స్టడీ అవర్‌ పూర్తిచేసుకుని స్నేహితులతో కలిసి గదికి వెళ్లాడు. అక్కడ 11 గంటల వరకు స్నేహితులతో కలిసి గేమ్స్‌ ఆడుకున్నారు. 

ఆ తర్వాత నిద్రించేందుకు ఎవరి గదికి వారు వెళ్లిపోయారు. 10వ తరగతి స్నేహితులను మిస్‌ అవుతున్నానని, వారు ఇప్పుడు తనతో మాట్లాడడం లేదని స్నేహితుడు ఫరూఖ్‌తో చెబుతూ బాధపడ్డాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం 5:15 గంటల ప్రాంతంలో ప్రతిరోజు మాదిరిగానే కళాశాల వార్డెన్‌ విద్యార్థులను నిద్రలేపుతుండగా 238 నంబర్‌ గదిలో రాఘవ బెడ్‌పై మెడకు తాడుతో పడి ఉన్నాడు. వెంటనే కళాశాల సిబ్బంది దగ్గర్లో ఉన్న ల్యాండ్‌ మార్క్‌ ఆసుపత్రికి ద్విచక్రవాహనంపై తీసుకువెళ్లారు. 

అక్కడి డాక్టర్లు పరిశీలించి విద్యార్థి మృతి చెందాడని తెలిపారు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి గాంధీ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కళాశాల నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే కౌశిక్‌ మృతి చెందాడని, కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, మాకు న్యాయం చేయాలని విద్యార్థి తల్లి మాధవి మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కౌశిక్‌ ఆత్మహత్య చేసుకోలేదన్నారు. మృతిపై అనుమానం ఉందని పేర్కొన్నారు. కాగా కళాశాల ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే విద్యార్థి మృతి చెందాడని ఆరోపించారు.   

Advertisement
 
Advertisement
Advertisement