యూట్యూబ్‌ వీడియోలు చూసి... | Hyderabad Police Arrest Thieves Gang | Sakshi
Sakshi News home page

యూట్యూబ్‌ వీడియోలు..దొంగలకు పాఠాలు

Jan 17 2021 8:25 AM | Updated on Jan 17 2021 10:49 AM

Hyderabad Police Arrest Thieves Gang - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీ కుమార్‌

సాక్షి, సిటీబ్యూరో: అబిడ్స్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలోని జగదీష్‌ మార్కెట్‌లో ఉన్న మహాలక్ష్మీ అమ్మవారి ఆలయంలో జరిగిన చోరీ కేసు తీగ లాగితే మూడు కమిషనరేట్లతో పాటు సంగారెడ్డిలో జరిగిన 25 దొంగతనాల డొంక కదిలింది. ఆరు నెలల కాలంలో ఈ నేరాలకు ఒడిగట్టిన అంతర్రాష్ట్ర ముఠాను అబిడ్స్, సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నట్లు నగర పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తెలిపారు. డీసీపీ విశ్వప్రసాద్, అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మి, ఏసీపీ కె.వెంకట్‌రెడ్డిలతో కలిసి శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  పూర్తి వివరాలు వెల్లడించారు. 

కర్ణాటకలోని బీదర్‌ ప్రాంతానికి చెందిన వజీద్‌ 17 ఏళ్ళ వయస్సులో 2019లో నగరానికి వలసవచ్చి ఓ ప్రైవేట్‌ ఉద్యోగంలో చేరాడు. 
అక్కడే వట్టేపల్లికి చెందిన అబ్దుల్‌ సమీర్, ఇస్మాయిల్, షహీద్, అమీర్, ఇలియాస్‌లతో పరిచయం ఏర్పడింది. వీరంతా దురలవాట్లకు బానిసలుగా మారారు. డబ్బు కోసం నేరాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చి బీదర్‌లో స్థిరపడిన కార్మికుడు షేక్‌ సోనుతో కలిసి ఓ ముఠా ఏర్పాటు చేశాడు.  
వీళ్ళంతా కలిసి నగరంతో పాటు శివార్లలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తక్కువ «ఖరీదు లాడ్జిల్లో బస చేస్తారు. పగలంగా నిద్రపోతూ రాత్రి వేళల్లో సంచరిస్తారు. 
శివారు ప్రాంతాల్లో ఇళ్ళ బయట పార్క్‌ చేసి ఉండే ద్విచక్ర వాహనాలను చోరీ చేయడం మొదలుపెట్టారు.యూట్యూబ్‌లో చూసి వాటి తాళాలు ఎలా పగులకొట్టాలో నేర్చుకున్నారు. 
ఈ గ్యాంగ్‌ చోరీ సొత్తుతో పాటు వాహనాలనూ తీసుకువెళ్ళి వట్టేపల్లికి చెందిన మçహ్మద్‌ సమీర్, బీదర్‌కు చెందిన బాబురావులకు విక్రయించి సొమ్ము పంచుకుంటోంది. 
గడిచిన ఆరు నెలల కాలంలో ఈ అంతరాష్ట్ర ముఠా హైదరాబాద్‌లో మూడు, సైబరాబాద్‌లో 15, రాచకొండలో ఒకటి, సంగారెడ్డిలో ఆరు నేరాలు చేసింది. 
ఈ నెల 3న జగదీష్‌మార్కెట్‌లోని అమ్మవారి దేవాలయంలో చోరీ చేసిన వీళ్ళు వెండి, బంగారు నగలతో పాటు సీసీ కెమెరాల డీవీఆర్‌ కూడా ఎత్తకుపోయారు. 
అబిడ్స్‌ పోలీసులు, దక్షిణ మండల టాస్క్‌ఫోర్స్‌ అధికారులు వందల సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ పరిశీలించారు. వజీద్‌ మూడు నెలలుగా నాంపల్లిలోని రెండు లాడ్జిల్లో ఉండి వెళ్ళినట్లు వెలుగులోకి వచ్చింది. అక్కడ దొరికిన ఆధారాలను బట్టి ముందుకు వెళ్ళారు. 
షహీద్, అమీర్, ఇలియాస్‌ మినహా మిగిలిన దొంగల్ని, ఇద్దరు రిసీవర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.35 లక్షల విలువైన 23 బైక్స్, వెండి, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.  
అబ్దుల్‌ షోయబ్‌పై గతంలో పహాడీషరీఫ్‌లో హత్య, మైలార్‌దేవ్‌పల్లిలో దోపిడీ, చోరీ కేసులు ఉన్నాయి. ఈ గ్యాంగ్‌పై పీడీ యాక్ట్‌ ప్రయోగించాలని కొత్వాల్‌ నిర్ణయించారు.  

Advertisement
 
Advertisement
Advertisement