అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ డంప్‌ స్వాధీనం | Sakshi
Sakshi News home page

అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ డంప్‌ స్వాధీనం

Published Sun, May 26 2024 3:16 AM

Huge dump seized in Alluri Sitaramaraju district

పోలీసులను హతమార్చాలన్నదే మావోల లక్ష్యం 

చాకచక్యంగా నిర్విర్యం చేసిన పోలీసులు 

లోతుగా దర్యాప్తు చేస్తున్నాం 

ఎస్పీ తుహిన్‌ సిన్హా

పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): కూంబింగ్‌కు వచ్చిన పోలీస్‌ పార్టీలను హతమార్చాలనే లక్ష్యంతో మావోయిస్టులు ఏర్పాటు చేసిన భారీ డంప్‌ను పోలీసులు చాకచక్యంగా వెలికితీసి నిర్విర్యం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుహిన్‌ సిన్హా వెల్లడించారు. జీకే వీధి మండలం సీలేరు పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పనసలబంద పరిసర అటవీ ప్రాంతంలో ఈ నెల 24న పోలీస్‌ పార్టీలు కూంబింగ్‌కు వెళ్లాయి. వారిని హతమార్చాలనే లక్ష్యంతో మావోలు ఏర్పాటు చేసిన భారీ డంప్‌ను పోలీసులు గుర్తించి స్వా«దీనం చేసుకున్నారు.

ఈ డంప్‌లో ఆరు స్టీల్‌ క్యారేజ్‌ మందు పాత్రలు, రెండు డైరెక్షనల్‌ మైన్స్, ఖేల్‌ కంపెనీకు చెందిన ఒక పేలుడు పదార్థం, 150 మీటర్ల ఎలక్ట్రికల్‌ వైరు, ఐదు కిలోల మేకులు, ఇనుప నట్లు, విప్లవ సాహిత్యం ఉన్నాయని ఆయన వివరించారు. జిల్లాలో మావోయిస్టులు దాచిపెట్టిన డంప్‌లన్నింటినీ స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. మావోల కుట్రపూరిత ప్రణాళికలపై గిరిజనులంతా అప్రమత్తంగా ఉండాలని, వారి మాటలు నమ్మొద్దని సూచించారు.

మావోలకు  పేలుడు పదార్థాలు లభించడంపై లోతుగా దర్యాప్తు చేస్తున్నామని, పనసలబంద అటవీ ప్రాంతంలో అధారాల కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. డంప్‌ను స్వా«దీనం చేసుకోవడంలో కీలకపాత్ర పోషించిన సీలేరు ఎస్‌ఐ రామకృష్ణ, ఆర్‌ఎస్‌ఐ జాన్‌రోహిత్, జి.మాడుగుల ఎస్‌ఐ శ్రీనివాసరావులను ఎస్పీ అభినందించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement