పిల్లల పాలిట కాలయముడు.. భార్య మీద కోపంతో కూతుళ్లపై.. | He poisoned his daughters out of anger at his wife | Sakshi
Sakshi News home page

పిల్లల పాలిట కాలయముడు.. భార్య మీద కోపంతో కూతుళ్లపై..

Apr 11 2023 4:19 AM | Updated on Apr 11 2023 8:04 AM

He poisoned his daughters out of anger at his wife - Sakshi

పాలకుర్తిటౌన్‌: కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రి.. ఆ పిల్లల పాలిట కాలయముడయ్యాడు. భార్యపై కోపంతో ఇద్దరు కుమార్తెలపై విష ప్రయోగం చేశాడు. పెద్ద కుమార్తె చికిత్స పొందుతూ మృతి చెందగా, చిన్న కుమార్తె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఈ విషాద ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు శివారు జానకీపురంలో సోమవారం వెలుగులోకి వచ్చింది.

ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన వివరాల ప్రకారం.. జానకీపురానికి చెందిన గుండె శ్రీనుకు మండలంలోని దర్దెపల్లి గ్రామానికి చెందిన ధనలక్ష్మితో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి పిల్లలు నాగప్రియ(9), నందిని (5), రక్షిత్‌ తేజ్‌(4) ఉన్నారు. శ్రీను మేస్త్రీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతు న్నాయి. భార్యను వేధించిన కేసులో శ్రీను జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. దీంతో ధనలక్ష్మి భర్తను విడిచి పిల్లలతో పుట్టింటికి వెళ్లింది.

పెద్ద మనుషులు రాజీ కుదిర్చి ఆమెను కాపురానికి పంపించారు. తీరు మారని శ్రీను భార్యను చిత్ర హింసలకు గురిచేశాడు. విసిగిపోయిన భార్య ఇటీవల కుమార్తెలను తండ్రి వద్దే వదిలి నాలుగేళ్ల కుమారుడితో పుట్టింటికి వెళ్లింది. భార్య తనతో లేనప్పుడు పిల్లలు ఎందుకని భావించిన శ్రీను వారిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. ఈ నెల 6న కూల్‌డ్రింక్‌లో విషం కలిపి కుమార్తెలకు ఇచ్చాడు. అదేమీ తెలి యని బిడ్డలు దాన్ని తాగారు.

అపస్మారక స్థితికి చేరిన పిల్లలను జనగామ ఆస్పత్రికి తరలించాడు. పెద్ద కుమార్తె నాగప్రియ పరిస్థితి విషమించడంతో ఎంజీఎం తరలించా రు. చికిత్సపొందుతూ సోమవారం ఉదయం మృతిచెందింది. చిన్న కుమార్తె నందిని ఆరోగ్యం సైతం ఆందోళనకరంగా మారడంతో సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు శ్రీనుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement