బంగారం వ్యాపారులపై తుపాకీతో కాల్పులు | Gunfire on gold traders | Sakshi
Sakshi News home page

బంగారం వ్యాపారులపై తుపాకీతో కాల్పులు

Aug 23 2024 5:20 AM | Updated on Aug 23 2024 5:20 AM

Gunfire on gold traders

ముళ్లపొదల్లోకి గోల్డ్‌ విసిరేసిన వర్తకులు 

బుల్లెట్‌ తగిలి ఒకరికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు 

విజయనగరం జిల్లా అప్పన్నవలస కూడలి వద్ద ఘటన

చీపురుపల్లిరూరల్‌(గరివిడి): బంగారు వ్యాపారుల­పై గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్పులు జరిపిన ఘటన విజయనగరం జిల్లా గరివిడి మండలం అప్పన్నవలస కూడలి వద్ద బుధవారం రాత్రి జరిగింది. గరివిడి ఎస్‌ఐ ఎల్‌.దామోదరరావు కథ­నం ప్రకారం... రాజాం పట్టణంలో నివసిస్తున్న ఇద్దరు బంగారు వర్తకులు రాత్రి 11 గంటల సమయంలో విజయనగరం నుంచి రాజాం వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. 

చీపురుపల్లి–రాజాం ప్రధాన రహదారిలో గరివిడి మండలం అప్పన్న­వలస కూడలి వద్దకు వచ్చేసరికి గుర్తుతెలియని ఇద్దరు వ్యక్తు­లు వాహనాన్ని అడ్డగించి దాడి చేశారు. తుపాకీ తీసి కాల్పులు జరిపారు. ఈ క్రమ­ంలో వర్తకులు తమ వద్ద ఉన్న బంగారాన్ని సమీప­ంలో ఉన్న తుప్పల్లోకి విసిరేశారు. వారి నుంచి ఏమీ దొరక్కపోవడంతో సెల్‌ఫోన్లను లాక్కున్నారు. దుండగలు జరిపిన కాల్పుల్లో ఒక వర్తకుడికి బుల్లెట్‌ తగిలి ఎడమ చేతికి గాయమైంది. 

ఆయన రాజాం కేర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనా స్థలాన్ని క్లూస్‌ టీం బృందం, డాగ్‌స్క్వాడ్‌ పరిశీలించాయి. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ నెల 7న ఇదే రోడ్డు­లో గరివిడి మండలం కాపుశంబం కూడలి వద్ద కూడా రాత్రి 12 గంటల సమయంలో చీపురుపల్లి వైపు వెళ్తున్న ఆటోను కొంతమంది వ్యక్తులు ఆపి దాడి చేయడమే కాకుండా వెంటాడి భయాందోళనకు గురిచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement