సాక్షి, హైదరాబాద్: కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఏటీఎం వద్ద చోరీ కేసులో పురోగతి చోటు చేసుకుంది. బాధితుడి స్కూటీ మీద పారిపోయిన నిందితులు.. దానిని కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపంలో వదిలి వెళ్లారు. ఈ క్రమంలో కొన్ని క్లూస్ను పోలీసు ప్రత్యేక బృందాలు సేకరించాయి.
చోరీ అనంతరం నేరుగా కాచిగూడ డీమార్డ్ సమీపంలోని ఓ ప్రార్థనా మందిరంలోకి వెళ్లిన నిందితులు.. దుస్తులు మార్చుకున్నారు. అటుపై స్కూటీని స్టేషన్ దగ్గర వదిలి వెళ్లిపోయారు. అయితే అక్కడి నుంచి రైలెక్కి పారిపోయారా? లేదంటే బస్సు, ఇతర వాహనంలో పారిపోయారా? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ క్రమంలో కాచిగూడ పరిధిలోని ప్రధాన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.
కోఠిలో ఈ ఉదయం జరిగిన చోరీ.. నగరవాసుల్ని ఉలిక్కి పడేలా చేసింది. రిన్షాద్(26) అనే వ్యక్తి శనివారం ఉదయం 7గం. ప్రాంతంలో తన డబ్బు డిపాజిట్ చేయడానికి కోఠి హెడ్ ఆఫీస్ బయట ఉన్న ఏటీఎం వద్దకు వెళ్లాడు. అతన్ని ఫాలో అవుతూ వచ్చిన ఐదుగురు దుండగులు.. తుపాకీతో బెదిరించారు. వాళ్లను అడ్డుకునేందుకు రిన్షాద్ ప్రయత్నించగా రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఈ క్రమంలో రిన్షాద్ కాలి నుంచి బుల్లెట్ దూసుకెళ్లింది. ఆ కంగారులో నగదు బ్యాగుతో బాధితుడి బైక్ మీదే దుండగులు పారిపోయారు.


గాయపడిన రిన్షాద్ను స్థానికులు హుటాహుటిన ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అతనికి ప్రాణహాని తప్పిందని వైద్యులు ప్రకటించారు. సమాచారం అందుకున్న సుల్తాన్బజార్ పీఎస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ దృశ్యాల ఆధారంగా నిందితులను ట్రేస్ చేసే పనిలో ఉన్నారు.

రిన్షాద్ నాంపల్లిలో బట్టల వ్యాపారి అని, తన రూ.6 లక్షల నగుదును డిపాజిట్ చేసేందుకు వచ్చిన క్రమంలోనే చోరీ జరిగిందని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పావల్లి మీడియాకు వెల్లడించారు. క్లూస్ టీం ఘటనా స్థలం నుంచి రెండు షెల్స్ని స్వాధీనం చేసుకున్నాయన్నారు. కేవలం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే కాలిలో కాల్చి నగదు ఎత్తుకెళ్లి ఉంటారని.. నిందితులు పాత నేరస్తులై ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారామె. నిందితుల పట్టుకునేందుకు ఐదు బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారామె.



