డీఎంకే నాయకుడి హత్య

DMK Leader Assassinated At Chennai Anna Nagar - Sakshi

తిరువొత్తియూరు: అన్నానగర్‌కు చెందిన టి.పి.సత్రం 16వ వీధికి చెందిన డీఎంకే నాయకుడు సంపత్‌కుమార్‌ (48)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. చెన్నై అన్నానగర్‌ పోలీస్‌స్టేషన్‌ సమీపంలో బుధవారం రాత్రి సంపత్‌కుమార్‌ బైకులో వెళ్తుండగా.. ఆటోలో నుంచి కిందకు దిగిన ముగ్గురు కత్తులతో దాడి చేసినట్లు తెలిసింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.

భర్త దాడిలో భార్య మృతి:
అంబత్తూరు సమీపం సూరప్పటు జేపీ ఏపీ నగర రెండవ వీధికి చెందిన ముత్తు (40) బేకరీ నడుపుతున్నాడు. భార్య విజయలక్ష్మి (34). వీరికి దీపశ్రీ (14) అనే కుమార్తె, వసంత్‌ (10) అనే కుమారుడు ఉన్నారు. గత 14వ తేది భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో ఆగ్రహం చెందిన ముత్తు భార్య ముఖంపై తీవ్రంగా దాడి చేశాడు. మరుసటిరోజు ఆమె ముఖం వాపు ఏర్పడి వాంతులు కావడంతో ఆమెను చికిత్స కోసం స్టాన్లీ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ విజయలక్ష్మి గురువారం ఉదయం మృతి చెందారు. పోలీసులు ముత్తును అరెస్టు చేశారు.  

పెట్రోల్‌ చోరీని అడ్డుకున్నందుకు..
తిరువళ్లూరు జిల్లా నందిబాక్కం రైల్వేస్టేషన్‌ సమీపంలోని మీంజూర్‌ మేలూరు జోసెఫ్‌ వీధికి చెందిన వ్యక్తి రాజేష్‌ (24). తన బైక్‌ను రైల్వేస్టేషన్‌ పక్కన నిలిపి బుధవారం కట్టడ పనులకు వెళ్లాడు. రాత్రి రైల్వేస్టేషన్‌ చేరుకున్నాడు. ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇతడి బైక్‌ నుంచి పెట్రోల్‌ చోరీ చేస్తున్నారు. దీంతో వారిని రాజేష్‌ పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే వారు కత్తులతో దాడి చేయడంతో రాజేష్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.   
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top