108 వాహనానికి నిప్పు; నే సచ్చిపోతా!

Covid Suspect Burned 108 Ambulance In Ongole Andhra Pradesh - Sakshi

సాక్షి, ప్రకాశం: ఒంగోలు తాలుకా పోలీస్‌ స్టేషన్‌లో నేలపాటి సురేష్ అనే రౌడీ షీటర్ హల్చల్ చేశాడు. ఓ కేసు విచారణలో భాగంగా అతన్ని స్టేషన్‌కు తరలించగా పోలీసులకు చుక్కలు చూపించాడు. స్టేషన్‌లో అర్ధరాత్రి డోర్ అద్దాలు పగలగొట్టి చేతులు గాయపరుచుకున్నాడు. దీంతో అతన్ని పోలీసులు 108 వాహనం ఎక్కించి రిమ్స్‌ ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. 108 అంబులెన్స్ ఎక్కిన నిందితుడు అక్కడ ఉన్న కాటన్‌కు నిప్పంటించాడు. చూస్తుండగానే మంటలు ఎగసిపడ్డాయి.

అయినప్పటికీ నిందితుడు సురేష్‌ వింతగా నవ్వుతూ వాహనం నుంచి దిగడానికి మొండికేశాడు. ‘నే సచ్చిపోతా.. ఆనందంగా సచ్చిపోతా’ అంటూ పిచ్చిగా ప్రవర్తించాడు. ఎట్టకేలకు పోలీసులు అతన్ని బలవంతంగా కిందకు దించడంతో ప్రమాదం తప్పింది.  అయితే, వారి కళ్లుగప్పి సురేష్‌ పరారయ్యాడు. గత నాలుగు రోజులుగా నిందితుడి మానసిక పరిస్థితి బాగోలేక స్టేషన్‌లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడని పోలీసులు చెప్తున్నారు. అతన్ని కోవిడ్‌ అనుమాతుడిగా భావిస్తున్నామని వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. కాగా, మంటల ధాటికి అంబులెన్స్‌ పూర్తిగా కాలి బూడిదైంది.
(చదవండి: శ్రీశైలం గోడల రాళ్ల మధ్య 245 వెండి నాణేలు)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top