కుట్రకు ముందు టీడీపీ నేతలు కలిశారు  | Sakshi
Sakshi News home page

కుట్రకు ముందు టీడీపీ నేతలు కలిశారు 

Published Tue, Jul 6 2021 2:48 PM

Cash Vote Case: ACB Special Court Records Revanth Reddy Gunmen Statements - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓటుకు కోట్లు కుట్రకు ముందు రేవంత్‌రెడ్డిని పలువురు టీడీపీ కీలక నేతలు కలిశారని, తర్వాత వారంతా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నివాసానికి వెళ్లారని కేసులో ప్రధాన నిందితుడు, మల్కాజిగిరి ఎంపీ, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఒకప్పటి గన్‌మెన్లు వివరించారు. ఈ మేరకు గన్‌మెన్లు రాజ్‌కుమార్, వెంకటకుమార్‌లు మంగళవారం ఏసీబీ ప్రత్యేక కోర్టు ఎదుట హాజరై వాంగ్మూలం ఇచ్చారు.

‘2015 మే నెలలో తెలుగుదేశం పార్టీ మహానాడు జరిగింది. మహానాడులోనే ఈ కుట్రకు బీజం పడింది. మహానాడులో పాల్గొన్న తర్వాత వేం నరేందర్‌రెడ్డి, ఎల్‌.రమణ, ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ మంత్రిగా ఉన్న ఒకప్పటి టీడీపీ ముఖ్యనేతలతో రేవంత్‌రెడ్డి చర్చించారు. తర్వాత చంద్రబాబు ఇంటికి వెళ్లారు. అనంతరం స్టీఫెన్‌సన్‌ ఇంటికి వచ్చారు’అని వారు వివరించారు. మరో గన్‌మన్‌ మహ్మద్‌ అమీరుద్దీన్, రేవంత్‌రెడ్డి సోదరుడు కృష్ణారెడ్డి వాంగ్మూలాల నమోదు కోసం తదుపరి విచారణను న్యాయమూర్తి ఈనెల 8కి వాయిదా వేశారు.   

Advertisement
Advertisement