భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని.. యువకుడి బైకు దగ్ధం చేశాడు

Banjara Hills: Husband Burning Person Bike Caused His Wife Left House - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ (బంజారాహిల్స్‌): తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడానికి కారణమయ్యాడన్న కసితో ఓ యువకుడి బైక్‌ను దగ్ధం చేసిన ఘటనలో నిందితుడిని బంజారాహిల్స్‌ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల్లోకి వెళితే... గత నెల 24వ తేదీన రాత్రి బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్‌.11లోని ఉదయ్‌నగర్‌లో నివసించే బస్వాని వెంకటేష్‌(39) టైల్స్‌ వర్క్‌ ముగించుకొని ఇంటిముందు బైక్‌ పార్కు చేసి ఇంట్లోకి వెళ్లాడు.

తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో తన బైక్‌ పూర్తిగా కాలిపోయి ఉండటాన్ని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. ఫిర్యాదుదారు వెంకటేష్‌ను గట్టిగా ప్రశ్నించగా రెండు నెలల క్రితం జరిగిన ఘటనను వివరించాడు. ఇదే బస్తీలో నివసించే అసదీ నగేష్‌ అలియాస్‌ నాగి(38) స్థానికంగా నివసించే ఓ యువతితో చిట్‌చాట్‌ చేశాడు. ఈ విషయాన్ని వెంకటేష్‌ గమనించి ఆ యువతి భర్తకు తెలిపాడు. ఆ యువతి భర్త కొద్దిసేపటి తర్వాత నగేష్‌ ఇంటికి వచ్చి తీవ్రంగా గొడవ పడ్డాడు.

మరోవైపు... తన భర్త మరో యువతితో చిట్‌చాట్‌ చేస్తున్నాడని తెలుసుకున్న నగేష్‌ భార్య అలిగి పుట్టింటికి వెళ్లిపోయింది. తన భార్య పుట్టింటికి వెళ్లిపోవడం, కుటుంబంలో కలతలు రావడానికి వెంకటేష్‌ కారణమని తెలుసుకున్న నగేష్‌ ఆయనపై కక్ష పెంచుకున్నాడు. ఇందులో భాగంగానే గత నెల 25వ తేదీన తెల్లవారుజామున పార్కింగ్‌ చేసి ఉన్న వెంకటేష్‌ బైక్‌పై పెట్రోల్‌ పోసి దగ్ధం చేశాడు. పక్కనున్న శ్రీను అనే వ్యక్తి బైక్‌ కూడా ఈ మంటల్లో దగ్ధమైంది. మహబూబ్‌నగర్‌ జిల్లా నారాయణపేట మండలం గోడెబుల్లూరు గ్రామానికి చెందిన నగేష్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ కన్నెబోయిన ఉదయ్‌ తెలిపారు. 

చదవండి: అమెరికాలో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి.. ఇక్కడ అంబులెన్స్‌ డ్రైవర్‌గా..

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top