కన్నబిడ్డలనే కాల్వలోకి తోసి... | Atrocity in Bijinepalli mandal of Nagarkurnool district | Sakshi
Sakshi News home page

కన్నబిడ్డలనే కాల్వలోకి తోసి...

Sep 17 2023 2:25 AM | Updated on Sep 17 2023 4:01 AM

Atrocity in Bijinepalli mandal of Nagarkurnool district - Sakshi

బిజినేపల్లి:ల్లు తాగొద్దని భర్త హెచ్చరించాడన్న కోపంతో ఓ తల్లి ముక్కుపచ్చలారని తన నలుగురు చిన్నారులను కాల్వలో విసిరేసింది. ఈ ఉదంతం శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఎర్రకుంటతండాలో చోటుచేసుకుంది. మండలంలోని లట్టుపల్లి పంచాయతీ పరిధిలోని ఎర్రకుంట తండాకు చెందిన లలిత మంగనూర్‌కు చెందిన శరబందను ఎనిమిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కూతుళ్లు మహాలక్ష్మి (7), సాత్విక (5), మంజుల (3)తోపాటు 7 నెలల కుమారుడు ఉన్నారు.

ఈ క్రమంలో లలిత కొన్నాళ్లుగా మందు కల్లును తాగుతుండటంతో పలుమార్లు భర్త శరబంద మందలించాడు. దీంతో భర్త తరచూ మందలిస్తున్నాడని లలిత శనివారం బిజినేపల్లి పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. పోలీసులు శరబందను స్టేషన్‌కు రావాలని ఫోన్‌ చేసి పిలిచారు. మధ్యాహ్నం కావడంతో పిల్లలకు ఏమైనా తినిపించుకు వస్తానని చెప్పి వెళ్లిన లలిత.. పోలీస్‌స్టేషన్‌ సమీపంలోని కేఎల్‌ఐ కాల్వలోకి చిన్నారులతో కలిసి దిగింది. అటుగా వెళ్తున్న కొందరు ఆమెను గమనిస్తుండగానే నలుగురు చిన్నారులను కాల్వలోకి విసిరేసింది. వెంటనే వారు బిజినేపల్లి పోలీసులకు ఫోన్‌ చేసి సమాచారం అందించి కాల్వలోకి దిగారు.

పోలీసులు సైతం కాల్వ వద్దకు వచ్చి గాలించగా.. నీటి ఉధృతికి చిన్నారులు కిలోమీటరు మేర కొట్టుకుపోయారు. చివరికి ముగ్గురు కుమార్తెల మృతదేహాలు లభించగా.. బాలుడు మార్కండేయ ఆచూకీ లభించలేదు. అప్పటికే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. చిన్నారులను కాల్వలో విసిరేసిన తల్లిపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న భర్త శరబంద సైతం పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నాడు. చిన్నారుల మృతదేహాలను పోలీసులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ విషయమై భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement