వివాహేతర సంబంధం.. వ్యక్తి దారుణ హత్య

Assassinated With Fornication Relationship Case Rangareddy - Sakshi

కుత్బుల్లాపూర్‌: తాను సన్నిహితంగా ఉన్న మహిళతో చనువుగా ఉంటున్నాడనే అనుమానంతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. భాగ్యలక్ష్మి కాలనీలో మాధవరావు అనే వ్యక్తి మేస్త్రీగా పని చేస్తూ అదే భవనంలో ఉంటున్నాడు. పక్కనే ఉంటున్న పోచమ్మ అనే మహిళతో చనువుగా ఉంటున్నాడు. గతంలో పోచమ్మ మెదక్‌ జిల్లాలో ఉండగా కృష్ణ అనే వ్యక్తితో సహజీవనం చేసింది. ఈ విషయంపై కుల పెద్దలు పంచాయితీ పెట్టి పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. అయితే పోచమ్మ, కృష్ణ ఇద్దరు కలిసి రెండు నెలల క్రితం అక్కడి నుంచి ప్రగతినగర్‌కు వచ్చారు.

బంధువులు చివరికి వీరిద్దరిని గుర్తించి మరోసారి మందలించారు. మకాం మార్చి భాగ్యలక్ష్మి కాలనీలో ఉంటున్నారు. వీరి పక్కనే కొత్తగా భవన నిర్మాణం చేపట్టే మాధవరావుతో పోచమ్మ ఒంటరిగా ఉన్న సమయంలో చనువుగా ఉంటూ వస్తుంది. ఈ విషయాన్ని గుర్తించిన కృష్ణ గురువారం మధ్యాహ్నం వరకు పోచమ్మతో ఉండి ఊరికి వెళ్లొస్తానని చెప్పి సాయంత్రం మరో సారి ఫోన్‌ చేశాడు. ఫోన్‌లో రెస్పాన్స్‌ ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి రాగా ఇంట్లో లేదు. పక్కనే ఉన్న మాధవరావు గదికి వెళ్లగా అక్కడే ఉంది.  కోపోద్రిక్తుడైన కృష్ణ బయటకు వెళ్లి అర్ధరాత్రి సమయంలో ఒంటరిగా నిద్రపోతున్న మాధవరావుపై కత్తితో దాడి చేసి బండరాయితో మోది హత్య చేసి పారిపోయాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ మన్సూర్‌ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top