అమానుష చర్య: ఆ హత్య కేసులో తండ్రి కొడుకులిద్దరికి జీవిత ఖైదు!! | Arbery killers Get Life In Prison No Parole For Father And Son | Sakshi
Sakshi News home page

అమానుష చర్య: ఆ హత్య కేసులో తండ్రి కొడుకులిద్దరికి జీవిత ఖైదు!!

Jan 8 2022 1:04 PM | Updated on Jan 8 2022 2:56 PM

Arbery killers Get Life In Prison No Parole For Father And Son - Sakshi

జాత్యాహంకార విద్వేషపూరిత చర్యలు ఇంకా పలు దేశాల్లో నిగురు గప్పిన నిప్పువలే రగులుతున్నాయి. ఎంతో మంది గొప్పగొప్ప మహోన్నత వ్యక్తుల ఈ జాడ్యాన్ని విడిచిపెట్టండని చెబుతున్న ఇంకా పలువురు తమ అహంకారపూరిత దర్పాన్ని అభాగ్యులపై రుద్దుతు విద్వేషచర్యలకు పాల్పడుతూనే ఉంటున్నారు. ఇలాంటి చర్యలను అరికట్టేందుకే పటిష్టమైన చట్టాలను తీసుకువస్తున్నప్పటికీ ఈ పైశాచిక చర్యలకు అడ్డుకట్ట వేయలేకపోవడం బాధకరం. అయితే ఇప్పుడు అచ్చం అలాంటి జాత్యాహంకారంతో ఓ తండ్రి కొడుకులు ఒక నల్ల జాతీయుడిని అమానుషంగా చంపి కటకటాలపాలయ్యారు.

అసలు విషయంలోకెళ్లితే.... అమెరికా న్యాయస్థానం తాజాగా అహ్మద్‌ అర్బరీ అనే 25 ఏళ్ల నల్లజాతీయుడిని వెంబడించి హత్య చేసినందుకు గానూ ముగ్గురు శ్వేతజాతీయులకు యావజ్జీవ కఠిన కారాగార శిక్ష విధించింది. అంతేకాదు తండ్రి కొడుకులకు పెరోల్‌ (బెయిల్‌ పై విడుదలవ్వడం) మంజూరు చేయడానికి  కూడా కోర్టు నిరాకరించింది. ఈ మేరకు న్యాయమూర్తి తిమోతీ వాల్మ్‌స్లీ మాట్లాడుతూ... "అర్బరీ తాను జాగింగ్‌కి వెళ్లుతున్నప్పడు ఇదే చివరి జాగింగ్‌ అవుతుందని అనుకుని ఉండడు .  అతను ప్రాణాల కోసం పరిగెడుతుంటే ఏ మాత్ర జాలి దయ లేకుండా అత్యంత క్రూరంగా వెంటాడి వెంబడించి చంపారు.

అంతేకాదు ఇది జాత్యాహంకార పూరిత హత్య నేరంగా అభివర్ణించారు. పైగా ఆ సమయంలో ఆ యువకుడిలో కలిగిన భయాందోళనలు ఏవిధంగా ఉంటాయో ఊహించగలను" అంటూ భావోద్వేగం చెందారు. ఈ మేరకు మాజీ పోలీస్‌ ఆఫీసర్‌ గ్రెగ్‌ మెక్‌ మైఖేల్‌ అతని కొడుకు ట్రావిస్‌ మైఖేల్‌ ఫిబ్రవరి 23, 2020న పోర్ట్ సిటీ ఆఫ్ బ్రున్స్‌విక్ పరిసరాల్లో పరిగెడుతున్న మహ్మద్‌ అర్బీని తుపాకులతో వెంబడించి దారుణంగా చంపారని అన్నారు. ఈ క్రమంలో గ్రెగ్‌ మైఖేల్‌ పక్కింటి వ్యక్తి అయిన రోడీ బ్రయాన్ ఈ హత్య నేరానికి సహకరించినట్లు పేర్కొన్నారు.  పైగా ఈ ముగ్గురు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని ఈ హత్యా నేరానికి పాల్పడినట్లు వెల్లడించారు.

ఈ మేరకు తండ్రి కొడుకులిద్దరిని ఎలాంటి పెరోల్‌ లేకుండా జీవితాంతం జైలు శిక్ష అనుభవించాలని, పైగా ఈ హత్యా నేరానికి సహకరించిన బ్రయానికి 30 సంవత్సరాల జైలు శిక్ష అనంతరం పెరోల్‌కి అవకాశం కల్పిస్తున్నట్లు న్యాయమూర్తి వాల్మ్‌స్లీ పేర్కొన్నారు. ఈ తీర్పు వెలువడిన వెంటనే అర్బరీ కుటుంబ మద్దతుదారులు నల్లజాతీయులను తగిన న్యాయం జరిగిందని, మీ అబ్బాయి ఒక చరిత్ర సృష్టించాడంటూ అర్బరీ కుటుంబాన్ని ప్రశంసలతో ముంచెత్తారు.

అయితే నిందితుల తరుపున న్యాయవాదులు ఇది అనుకోని చర్యగానూ, నేరస్తుడనే అనుమానంతో కాల్పులు జరిపారే తప్ప ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు అంటూ కప్పిపుచ్చేందకు ప్రయత్నించారు. మరోవైపు బ్రయాన్ తరుపు న్యాయవాది అతను కేవలం ఆ ఘటనను సెల్‌ఫోన్‌లో వీడియో తీశాడే తప్ప మరేం చేయలేదు, పైగా పశ్చాత్తాపడుతున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే కోర్టు వాటన్నింటిని తోసి పుచ్చింది. దీంతో మెక్‌ మేఖేల్స్‌, బయోన్‌ తరపు న్యాయమూర్తులు పై కోర్టుకు అప్పీలు చేయాలని యోచిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement