పెనుమూరు(కార్వేటినగరం): వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2022లో పట్టాలు ఇచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇంటి నిర్మాణాలను ఆపి ఖాళీ చేయమంటున్నారు. ఇదెక్కడి న్యాయం అని పెనుమూరు మండలం కేసీపల్లి పంచాయతీ కంబాల చేను గ్రామస్తులు వాపోతున్నారు. కంబాల చేను గ్రామానికి చెందిన 13 మంది పేదలకు గత ప్రభుత్వం ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. 9 మంది ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. ఆర్థికంగా వెనుకడి ఉండడంతో కొందరు వివిధ దశల్లో నిర్మాణాలను ఆపేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ నాయకులు రెవెన్యూ అధికారులతో కలిసి ఇళ్లు మంజూరు చేసిన సర్వే నంబర్ మారిందని, అందులో ఇళ్ల నిర్మాణం చేయకూడదని ఆంక్షలు విధించారు. బాధితులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. బెదిరింపులకు గురిచేస్తున్న వారికి లాయర్ ద్వారా నోటీసులు పంపించారు. ఇవేవీ పట్టించుకోకుండా కూటమి నాయకుల అండతో రెవెన్యూ అధికారులు ఆదివారం పునాదులను జేసీబీతో తొలగించారు. తాము వైఎస్సార్సీపీ సానుభూతిపరులుగా ఉండడమే మేము చేసిన పాపమా అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా అధికారులు స్పందించి తమకు 2022లో మంజూరు చేసి పట్టాలను పరిశీలించి ఇళ్ల నిర్మాణాలు చేసుకోవడానికి అనుమతులు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన భూమికి ఉన్న సర్వే నంబర్లు కూడా మారుతాయా అని ప్రశ్నిస్తున్నారు.
పునాదులను జేసీబీతో తొలగిస్తున్న కూటమి నాయకులు
గత ప్రభుత్వం మంజూరు చేసిన పట్టాలను చూపిస్తున్న లబ్ధిదారులు


