చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం మంగళవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్కో ఎస్ఈ అమర్బాబు తెలిపారు. వినాయకచవితి రోజున ప్రభుత్వ సెలవు దినం కావడంతో సోమవారం నిర్వహించాల్సిన కార్యక్రమాన్ని మరుసటి రోజుకు మార్పు చేశారన్నారు. వినియోగదారులు మంగళవారం ఉద యం 8.30 నుంచి 9.30 గంటల మధ్య 7993147979 నంబర్కు కాల్చేసి సమస్యలు తెలియజేయాలని సూచించారు.
కాణిపాకం బ్రహ్మోత్సవాలకు ఐదు టన్నుల కూరగాయలు
పలమనేరు: కాణిపాకంలో జరిగే బ్రహ్మోత్సవాలకు పలమనేరుకు చెందిన మోహన్రెడ్డి ఐదు టన్నుల కూరగాయలను వితరణ చేశారు. వాటిని ఆదివారం ప్రత్యేక వాహనంలో పంపించారు. 21 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు ప్రతి మూడు రోజులకు ఓ లోడు కూరగాయలను దాతల ద్వారా పంపనున్నట్టు శ్రీవారి భక్తులు రవీంద్రారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కిశోర్స్వామితోపాటు పలువురు పాల్గొన్నారు.
నేడు వినాయకుడికి
పట్టువస్త్రాల సమర్పణ
కాణిపాకం: స్వయంభు వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో 2026 వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్వామివారికి పట్టువస్త్రాలు అందజేస్తారని ఈవో పెంచల కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు.
బయటపడిన
హనుమ రాతి ప్రతిమ
శాంతిపురం: మండలంలోని సొన్నేగానిపల్లి పంచాయతీ కూతేగౌనిపల్లిలో హనుమంతుడి రాతి విగ్రహం ఆదివారం బయటపడింది. గ్రామానికి చెందిన ఆనందగౌడుకు చెందిన ఆవు దూడ కాళ్లతో నేలపై గోకడంతో నల్లటి రాయి కొంత బయట పడింది. దీన్ని గమనించి మరి కొంత తవ్వడంతో ఆంజనేయస్వామి రాతి విగ్రహం బయటపడిందని గ్రామస్తులు చెప్పారు. విగ్రహానికి పూజలు చేశారు. వినాయక చవితి వేళ అన్ని గ్రామాలకు ప్రతిమల రూపంలో వినాయకుడు వస్తే తమ గ్రామానికి గణనాథుడితో పాటు హనుమంతుడు కూడా వచ్చాడని ఆనందం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ ప్రకాష్ బాబు, ఎస్ఐ నరేష్ గ్రామానికి వెళ్లి స్వాధీనం చేసుకుని తీసుకెళ్లారు. దాన్ని పరిశీలించి ఏకాలం నాటిదో తెలియజేస్తామన్నారు.


