చిట్వేలి: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంగళవారం మదనపల్లిలో జరిగిన జిల్లా స్థాయి యోగాసన పోటీల్లో పాల్గొని విశేష ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి తెలిపారు. పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న సింధు, దిలీప్, సమద్, ఏడో తరగతి విద్యార్థులు లక్ష్మీనారాయణ, లాస్యకుమార్, శివనందు, ఎనిమిదో తరగతి చదువుతున్న హర్షవర్దన్, తొమ్మిదో తరగతి చదువుతున్న తనూజ, గ్రీస్మిత సాయి యోగాసన జిల్లా స్థాయి పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించినట్టు వెల్లడించారు. యోగాసన స్టేట్ మీట్కు ఎంపికై న విద్యార్థినీ విద్యార్థులను ఇన్చార్జ్ హెడ్మాస్టర్ సోఫియా అభినందించారు.
బంగారు ఆభరణాల అప్పగింత
తిరుపతి అన్నమయ్యసర్కిల్: తిరుమలకు వెళ్తున్న తమిళనాడుకు చెందిన భక్తుడు పి.కార్తికేయన్సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో చెక్పాయింట్ వద్ద తన బ్యాగును పొరపాటున మరిచిపోయి వెళ్లారు. వెంటనే సిబ్బంది బ్యాగును గుర్తించి, అందులో లభించిన వివరాల ఆధారంగా భక్తుడిని సంప్రదించి అలిపిరి చెక్పాయింట్ వద్దకు రావాలని సమాచారం అందించారు. ఆ మేరకు చేరుకున్న భక్తుడు బ్యాగులోని వస్తువులను గుర్తించి ధృవీకరించిన అనంతరం బ్యాగును సురక్షితంగా ఆయనకు అప్పగించారు. బ్యాగులో రూ.10,900 నగదుతో పాటు రెండు గాజులు, ఒక బంగారు గొలుసు, రెండు బంగారు ఉంగరాలు ఉన్నాయి. వీటి విలువ సుమారు రూ.5 లక్షలు ఉంటుందని టీటీడీ సెక్టార్–5 ఏవీఎస్వో రమేష్ తెలిపారు. విజిలెన్స్ అధికారులు, సిబ్బంది చూపిన అప్రమత్తత, నిజాయితీతో విలువైన వస్తువులను తిరిగి అప్పగించడంతో భక్తుడు కృతజ్ఞతలు తెలిపారు.


