చోద్యం చూస్తున్న సీఎం చంద్రబాబు
చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన ధ్వజం
తిరుపతి మంగళం : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతిపక్షం గొంతునొక్కేందుకు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడులకు తెగబడుతున్నారని చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రామకుప్పం మండలం, పెద్దూరు ఎంపీటీసీ వెంకటరమణారెడ్డిపై టీడీపీ గూండాలు దాడి చేసి కారు అద్దాలు పగులగొట్టి విధ్వంసం సృష్టించడాన్ని ఆయన ఖండించారు. తిరుపతి పద్మావతిపురంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయడంలో చంద్రబాబు శ్రద్ద చూపడం లేదన్నారు. ఎంతసేపు వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్.జగన్మోహన్రెడ్డిని దూషించడం, పార్టీ శ్రేణులపై దాడులకు తెగబడడం, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో టీడీపీ గూండాలు రెచ్చిపోతున్నారని, కుప్పంలో వైఎస్సార్సీపీ సమన్వయకర్త, ఎమ్మెల్సీ భరత్, జిల్లా పరిషత్ చైర్మన్లు నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారని తెలిపారు. ఆ సమావేశానికి వెళ్లి వస్తున్న తమ పార్టీ ఎంపీటీసీ వెంకటరమణారెడ్డిపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. కుప్పంలోనే టీడీపీ గూండాలు చేస్తున్న అరాచకాలు, దాడులను అదుపుచేయాల్సిన చంద్రబాబు చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కూటమి బెదిరింపులు, దాడులు, అక్రమ కేసులకు వైఎస్సార్సీపీలో భయపడేవాళ్లెవ్వరూ లేరని హెచ్చరించారు. మీరు ఎన్ని దాడులు చేసినా ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ ప్రజల పక్షాన నిలబడి ఉద్యమ పోరాటాలు చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు.
కుప్పంలో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు


