జిల్లాపై తీవ్రమైన ప్రభావం దెబ్బతింటున్న పంటలు అడుగంటిన రిజర్వాయర్లు ఎండిపోతున్న చెరువులు, కుంటలు తిరుపతిలో తాగునీటికి ఇక్కట్లు 173 మి.మీ వర్షపాతానికి నమోదైంది 50 మి.మీలు ఆందోళనలో అన్నదాతలు
ఎల్నినో పంజా విసిరింది. వాతావరణ పరిస్థితులపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ప్రధానంగా వర్షపాతం ఒక్కసారిగా పడిపోయింది. చుక్కనీటికి కటకటలాడాల్సిన దుస్థితి దాపురించింది. ఈ క్రమంలోనే జిల్లాలోని రిజర్వాయర్లతో నీటి మట్టం తగ్గిపోయింది. చెరువుల్లో సైతం నీరు అడుగంటింది. వ్యవసాయానికి ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది. పంటలు ఎండుముఖం పట్టాయి. దాహార్తిని తీర్చుకునేందుకు ఇక్కట్లు మొదలవుతున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో అధికారులు వైఫల్యం చెందడంతో ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
రిజర్వాయర్ నీటి ప్రస్తుత
పేరు సామర్థ్యం నిల్వ
టీఎంసీల్లో టీఎంసీల్లో
అరణియార్ 1,853 0.632
స్వర్ణముఖి బ్యారేజ్ 0.035 0.000
కల్యాణీ డ్యామ్ 0.910 0.257
కండలేరు 68.030 19.350
కాళంగి 0.240 0.001
కృష్ణాపురం 0.200 0.004
కై లాసగిరి 0.020 0.017
మల్లిమడుగు 0.181 0.006
ఎన్టీఆర్ జలాశయం 0.110 0.036
సోమశిల 78.000 18.699
సాక్షి ప్రతినిధి, తిరుపతి : చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఎల్నినో ప్రభావం తీవ్ర రూపం దాల్చింది. తాగు, సాగు నీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. పలుచోట్ల పంటలకు సాగు నీరు లేక మాడిపోతున్నాయి. మరో వైపు తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఇటు అన్నదాతలు.. అటు జనం ఇబ్బందులు ఎదుర్కొనక తప్పేట్టు లేదు. వర్షాలు కురవకపోవడంతో రెండు జిల్లాల్లో సాధారణ సాగు శాతం భారీగా పడిపోయింది. భూగర్భ జలాలు భారీగా పడిపోయాయి. రిజర్వాయర్లు, చెరువులు నీరు లేక వెలవెలబోతున్నాయి. ఫలితంగా సాగవుతున్న పంటలు సైతం నీరు లేక ఎండిపోతున్నాయి. మామిడి, కొబ్బరి చెట్లు ఎండిపోతుండడం తీవ్రమైన వర్షాభావ పరిస్థితులకు నిదర్శనం. పంటలు ఎండిపోతున్నా అధికార యంత్రాంగం పట్టించుకున్న దాఖలాలు కనిపించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రబీ ఆశలపై నీళ్లు
వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు ఖరీఫ్ సీజన్లో ఆశించిన స్థాయిలో పంటలు సాగు చేయలేకపోయారు. రబీకైనా వరుణుడు కరుణిస్తాడేమోనని ఆశగా ఎదురుచూశారు. సెప్టెంబర్ ప్రారంభమైనా వర్షాలు లేవు. ఆగస్టులో అక్కడక్కడ చిన్నపాటి చినుకులు మాత్రమే పడ్డాయి. ఈ పరిస్థితుల్లో రబీ సాగుపై అన్నదాతలు ఆశలు వదులుకున్నారు.
తాగునీటికి తప్పని తిప్పలు
ఎల్నినో ప్రభావంతో తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా తిరుపతి నగరంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. నగరవాసుల దాహార్తిని తీర్చే కై లాసగిరి, కల్యాణి డ్యామ్లో నీటి నిల్వలు భారీగా పడిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో ఉన్న బోర్ల నుంచి నీరు రావడం లేదు. ఫలితంగా నగరవాసులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకుంటున్నారు. ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉన్నప్పటికీ అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించకపోవటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తిరుపతి, చిత్తూరు జిల్లాలోని రిజర్వాయర్ల సమాచారం


