చిత్తూరు కలెక్టరేట్ : రీ సర్వే పనుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ హెచ్చరించారు. ఆయన గురువారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. జేసీ మాట్లాడుతూ రైతులకు ముందుగా నోటీసులు అందజేసి వారి సమక్షంలోనే సర్వే చేయాలని స్పష్టం చేశారు. గ్రామ సర్వేయర్ల నుంచి సమాచారం తీసుకోవడం సరికాదని మండిపడ్డారు. మండల సర్వేయర్లు స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని సూచించారు. గ్రౌండ్ ట్రూథింగ్, వెరిఫికేషన్ ప్రక్రియలకు స్పష్టమైన కాలపరిమితిని నిర్దేశించుకుని పనిచేయాలని ఆదేశించారు. భూమి అనేది ప్రజలకు అత్యంత కీలకమైన ఆస్తి అని పేర్కొన్నారు. కుటుంబ అవసరాలు, విద్య, వైద్యం, వివాహాలు, రుణాలకు ఇది ఆధారంగా ఉంటుందన్నారు. సర్వేలో చిన్న పొరపా టు జరిగినా ప్రజల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని చెప్పారు. గతంలో జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని పొరపాట్లకు తావులేకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. డేటా ఎంట్రీ, వీఆర్వో, తహసీల్దార్, ఆర్డీవో లాగిన్లలో ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. 5వ దశలో గ్రౌండ్ ట్రూథింగ్, వెక్టరైజేషన్, ఏరియా, కోరిలేషన్ ప్రక్రియలను చేపట్టాలన్నారు. సమావేశంలో ఫారెస్ట్ సెటిల్మెంట్ ఆఫీసర్ పుల్లారెడ్డి, సర్వే శాఖ ఏడీ పుల్లయ్య, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.


