బ్యాంకుల్లో బంగారం..
● నకిలీ నగలతో బురిడీ కొట్టిస్తున్న ఇంటి దొంగలు ● గిల్ట్ ఆభరణాలతో 38 లోన్లు పెట్టించిన అప్రైజర్
పలమనేరు : ప్రైవేటు గోల్డ్లోన్ బ్యాంకులైతే మోసం జరుగుతుందనే అనుమానాలు ఉంటాయి. కానీ, ఆర్బీఐ నిబంధనల మేరకు నడిచే బ్యాంకుల్లోనూ చీటింగ్కు పాల్పడుతుంటే ఖాతాదారులకు దిక్కుతోచని దుస్థితి దాపురించింది.జిల్లాలో జనాలను బురిడీ కొట్టించే గోల్డ్ బ్యాంకులు ఈమధ్య కాలంలో పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. సమస్యల్లో ఉన్నవారే వీరి టార్గెట్. ప్రభుత్వ బ్యాంకుల కంటే ఎక్కువగా డబ్బులిస్తారని ఆశపడిన జనం తమ బంగారాన్ని ఇలాంటి ప్రైవేటు బ్యాంకుల్లో తనఖా పెడుతున్నారు. తీరా ముంచాకగానీ ఈ మోసాలు జనాలకు అర్థం కావు. ఇటీవల పుంగనూరు, పలమనేరుల్లోని కనకదుర్గ గోల్డ్లోన్స్ బ్యాంకులో రూ.8 కోట్ల అక్రమాలు జరిగాయి. ఇందులో పలమనేరులో రూ.2.80 కోట్ల వరకు చేతివాటానికి గురైనట్లు ఆడిట్లో వెలుగుచూసిన విషయం తెలిసిందే. దీనిపై బాధితులు, బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు పుంగనూరు, పలమనేరు బ్రాంచ్లలోని పలువురు ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసి కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో పలమనేరుకు చెందిన కొందరు కూటమి నేతలు ఉండడంతో వారిని ఇక్కడి ఓ సీఐ తప్పించాడని, తర్వాత అతడిపై బదిలీ వేటు పడిన విషయం తెలిసిందే.
తాజాగా ఏం జరిగిందంటే..
పలమనేరులోని మదనపల్లె రోడ్డులో ఉన్న ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులో అప్రైజర్గా పనిచేసే కేశవాచారి తనకు కావాల్సిన వారితో నకిలీ బంగారం తనఖా పెట్టించి రుణాలను ఇప్పించాడు. ఆ విధంగా తన మనుషులు 12మంది ద్వారా మొత్తం 38 లోన్లను పెట్టించి సుమారుగా రూ.1.34 కోట్ల వరకు బ్యాంకును మోసం చేశాడు. ఈ వ్యవహారం గత రెండేళ్లుగా సాగినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల బాధ్యతలు తీసుకున్న బ్రాంచ్ మేనేజర్ దీనిపై ఆరా తీసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. జరిగిన అక్రమాలపై బ్యాంకు అధికారులమ ఫిర్యాదుతో స్థానిక పోలీసులు అప్రైజర్తోపాటు 12మందిపై కేసులు నమోదు చేసినట్టు తెలిసింది.
సిబ్బందే సూత్రధారులు
ఇలాంటి మోసాలకు పాల్పడే బంగారు తనఖా బ్యాంకుల్లో గోల్డ్ అప్రెజర్ ప్రధాన సూత్రధారికాగా కొందరు సిబ్బంది హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలోనూ కనకదుర్గ బ్యాంకులోని సిబ్బంది తమ బంధువుల ద్వారా భారీగా నకిలీ బంగారం తనఖా పెట్టించి రూ.కోట్లలో కొట్టేశారు. బ్యాంకులోని సిబ్బందే సూత్రధారులు, పాత్రధారులైతే ఇంటిమ దొంగను పట్టుకోవడం ఈశ్వరుడికై నా సాధ్యమా అనేమాట వినిపిస్తోంది. మొత్తం మీద ఏ బ్యాంకులో బంగారం తనఖా పెట్టాలన్నా ఖాతాధారులు అనుమానం పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.


