పలమనేరు పట్టణంలో అద్దె గది తీసుకొని ఇంజనీరింగ్ చదవుతున్న ఓ విద్యార్థిని సెల్ఫోన్ అతిగా వాడొద్దని తల్లిదండ్రులు మందలించారు. దీంతో అప్పటికే సెల్కు బానిసైన ఆ విద్యార్థి తన గదిలోనే ఆత్మహత్య చేసుకున్నాడు. పట్టణంలోని పదోతరగతి చదివే బాలికకు సెల్ కొన్విలేదని తన చేతిని బ్లేడ్తో కోసుకొని ఆస్పత్రిపాలైంది. ఇలాంటి ఘటనలు జిల్లాల్లో నిత్యకృత్యంగా మారాయి.
15లక్షలు దాటిన
యూజర్లు
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1990లో కీప్యాడ్ ఫోన్ల వాడకం మొదలైంది. తొలుత తిరుపతి, చిత్తూరు, కుప్పం, మదనపల్లెలో రిలయన్స్ మొబైల్ టవర్ల ద్వారా నెట్వర్క్ను అందిస్తూ సేవలను మొదలు పెట్టారు. ఆపై పలు సెల్ కంపెనీలు మార్కెట్లోని వచ్చాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 12వేల దాకా సెల్ఫోన్ టవర్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా జనాభా 48 లక్షలు కాగా వీరిలో సెల్ఫోన్లు (కీప్యాడ్, టచ్ మొబైల్) వాడేవారి సంఖ్య ప్రస్తుతం 15 లక్షలకు చేరింది. గత నాలుగేళ్లుగా సెల్ఫోన్ల వాడకం ఏటా 30 శాతం పెరుగుతున్నట్టు ట్రాయ్ (టెలిఫోన్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) లెక్కలు చెబుతున్నాయి. స్మార్ట్ఫోన్లను వాడే వారిలో రోజుకు యువత 4 గంటలు, విద్యార్థులు, 2 గంటలు, గృహిణిలు 6 గంటలు సగటుగా మారింది.
పలమనేరు : మనిషికి ఎన్ని సమస్యలున్నా పర్వాలేదు కానీ, నిమిషం పాటైనా చేతిలో సెల్ లేకుంటే బతకలేమన్నట్టుగా తయారయ్యారు.ఇప్పుడు పట్టణాలు, పల్లెలనే తేడా లేకుండా స్మార్ట్ఫోన్ల వాడకం ఎక్కువైంది. మొబైల్ లేకుంటే జనాలకు బుర్ర కూడా పనిచేయడం లేదు. మితిమీరిన సెల్ వాడకం మనిషి జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్నా మార్పు రావడం లేదు. ఇప్పటికే చాలామంది వారికి తెలియకుండానే మానసిక రోగుల్లా మారారు. ఇంకొందరు అనారోగ్యం పాలవుతున్నారు.
ఎక్కువ మంది రీల్స్కే..
స్మార్ట్ఫోన్ వాడుతున్న వారిలో 30 శాతం మంది యూట్యూబ్ చూస్తుండగా, 40 శాతంమంది వాట్సాప్ రీల్స్, మిగిలిన వారు ఫేస్బుక్, ఇన్ స్ర్ట్రాగామ్లను వాడుతున్నట్టు గూగూల్ చేసిన సర్వేలో తేలింది. విద్యార్థులు 50 శాతం మంది ఆన్లైన్లో గేమ్స్కోసం సమయం వెచ్చిస్తున్నా రు. మహిళలు పని పాటా చేసుకుంటూ కూడా సీరియళ్లను సెల్లోనే చూసేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ విధంగా సెల్ మనిషిని ఆవహించిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
సమయం వృథా
విద్యార్థులు సెల్ఫోన్ వాడకంతో విలువైన సమయాన్ని వృథా చేసుకుంటూ చదువులో వెనుకబడడం, ఫెయిల్ కావడం జరుగుతోంది. ఇక ప్రైవేటు సెక్టార్లలో పనిచేసేవారు సెల్ కారణంగా పనులు పెండింగ్ బడుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో కొందరు సెల్తోనే రోజంతా గడిపేస్తున్నారు. దీంతో ప్రభుత్వ సేవలు కుంటుపడుతున్నాయి. ముఖ్యంగా ఉత్పాధక రంగంలోనూ దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఇళ్లలోని మహిళలు రీల్స్ చూస్తూ కుటుంబాన్ని అసలు పట్టించుకోవడం లేదు.
సమస్యలు తప్పవు
రాత్రి పూట సెల్ చూడడం కారణంగా నిద్ర లేమి ప్రధాన సమస్యగా మారుతోంది. దీంతో మనిషి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత దెబ్బతింటోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వేలో తేలింది. ఇలాంటి వారికి కొన్నాళ్ల తర్వాత నిద్రరాని పరిస్థితి ఏర్పడుతుంది. శరీరంలో మెలటోనియన్ నిల్వలు నశించి డిప్రెషన్లోకి వెళ్లే ప్రమాదముంటుంది. ముఖ్యంగా నిద్రలేమి కారణంగా అధిక బరువు, లావెక్కడం జరుగుతుంది. చీకట్లో సెల్ఫోన్ చూడడంతో దాని నుంచే వచ్చే బ్లూ కిరణాలు రెటీనాను బలహీనం చేసి కేటరాక్ట్ సమస్యలు తప్పవు.
– డాక్టర్ మమతారాణి, సూపరింటెండెంట్, పలమనేరు ఏరియా ఆస్పత్రి


