బంగారుపాళెం: పదోతరగతిలో చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి, పబ్లిక్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులు కృషి చేయాలని డీఈవో లక్ష్మీ నారాయణ ఆదేశించారు. శనివారం బంగారుపాళెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, పీడీవీ కండ్రిగ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో నిర్వహిస్తున్న స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను డీఈవో సంద ర్శించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, 10వ తరగతి పరీక్షలో ఉత్తమ ఫలితాలను సాధించేందుకు సమష్టిగా కృషి చేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. అభ్యసన స్థాయిలో వెనుకబడిన పదవ తరగతి విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సంబంధిత సబ్జెక్టుల్లో బోధనా నైపుణ్యాలు పెంచుకోవడానికి, కొత్త విధానాలు తెలుసుకోవడానికి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు ఉపాధ్యాయులకు దోహద పడతాయన్నారు. పీడీవీ కండ్రిగలో పదవ తరగతి విద్యార్థులతో ముచ్చటించారు. 6,7 తరగతి విద్యార్థుల చేత ఇంగ్లీష్ చదివించారు. కార్యక్రమంలో ఎంఈఓ నాగేశ్వర్రావు, హెచ్ఎంలు జయకుమార్, చిట్టెమ్మ పాల్గొన్నారు.


