చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు సాంకేతిక, సృజనాత్మక నైపుణ్యాలు అవసరమని, ఆ మేరకు పెంపొందించుకోవాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో విద్యాశాఖ, ఓడీసీ (ఓసాట్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్), ఊస్పాట్ సంస్థల ఆధ్వర్యంలో ఎంపిక చేసిన పాఠశాలల హెచ్ఎంలతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాల విద్యలో విద్యార్థుల నైపుణ్యాలు మెరుగుపడాలన్నారు. ఓడీసీ, గూగుల్ క్లాస్రూమ్ వంటి డిజిటల్ వేదికలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇంగ్లిష్, మ్యాథమెటిక్స్, సైన్న్స్ వంటి ప్రధాన సబ్జెక్టులపై విద్యార్థులు పట్టు సాధించేలా నైపుణ్యాలను పెంపొందించాలని ఆదేశించారు. డిజిటల్ వేదికలతో విద్యార్థుల్లో సాంకేతిక విజ్ఞానం, సృజనాత్మకత సులభంగా పెరుగుతాయని తెలిపారు. ఓడీసీ ప్రత్యేక అధికారి, రిటైర్డ్ ఐఏఎస్ కేదార్ మాట్లాడుతూ ఎంపిక చేసిన పాఠశాలల్లో విధానాల అమలు తీరును హెచ్ఎంల ద్వారా అడిగి తెలుసుకున్నారు. డీఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ జిల్లాలోని 22 పాఠశాలలకు చెందిన 300 మంది టీచర్లు, 7 వేల మంది విద్యార్థులు ఓడీసీ ప్రోగ్రామ్లో భాగస్వాములవుతున్నారని వెల్లడించారు. వీరి కోసం ఇప్పటికే 131 ల్యాప్టాప్లు, 586 డిజిటల్ ట్యాబ్లు అందించామన్నారు. మరో 22 పాఠశాలల్లో ప్రత్యేక వైఫై కనెక్షన్ సౌకర్యం కల్పిస్తున్నామని వివరించారు. రాస్ వీడీ రమేష్రెడ్డి, ఏఎంఓ సుభాషిణి పాల్గొన్నారు.


