తిరుపతి రూరల్ : క్రీడల్లో పాల్గొనడం ద్వారా విద్యుత్ ఉద్యోగులకు ఒత్తిడి దూరమవుతుందని, మరింత సమర్థవంతంగా సేవలందించగలరని ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ తెలిపారు. తిరుపతిలో మూడు రోజులపాటు నిర్వహించిన 48వ ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డు అథ్లెటిక్స్, చెస్, బ్యాడ్మింటన్, క్యారమ్స్ టోర్నమెంట్ గురువారంతో ముగిసింది. అథ్లెటిక్స్ విభాగంలో తమిళనాడు ఓవరాల్ చాంపియన్గా నిలవగా, కర్ణాటక రెండు, ఆంధ్రప్రదేశ్ మూడవ స్థానాల్లో నిలిచాయి. బ్యాడ్మింటన్లో తమిళనాడు, చెస్లో తెలంగాణ, క్యారమ్స్లో తమిళనాడు జట్లు విజేతలుగా నిలిచాయి. వివిధ విభాగాల్లో ప్రతిభ కనబరిచిన జట్లకు సీఏండీ శివశంకర్, డైరెక్టర్ గురవయ్య ట్రోఫీలు అందజేశారు. స్పోర్ట్స్ కౌన్సిల్కు విశిష్ట సేవలు అందించిన ఎం.కృష్ణారెడ్డి, పురుషోత్తానికి జ్ఞాపిక అందించారు. డైరెక్టర్ కె.రామమోహన్రావు, చీఫ్ జనరల్ మేనేజర్లు ఎం.మురళీకుమార్, సీహెచ్ రామచంద్ర రావు, స్పోర్ట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు వి.చంద్రశేఖరరావు, ప్రధాన కార్యదర్శి జి.గంగాధర్రెడ్డి, స్పోర్ట్స్ ఆఫీసర్ కుమార వడివేలు పాల్గొన్నారు.
నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి చిత్తూరుకు చెందిన భక్తులు గురువారం రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. చిత్తూరుకు చెందిన పి.సాయికృష్ణ, అన్విక శ్రీ పేరిట అన్నదానానికి రూ. లక్ష విరాళాన్ని అందచేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు.


