‘వేంకటాద్రి’లో ఏదీ భద్రత!
తిరుమల: ఉగ్రవాద ముప్పు హెచ్చరికల నేపథ్యంలో తిరుమలలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉన్నప్పటికీ, వేలాది భక్తుల కోసం నిర్మించిన వేంకటాద్రి నిలయంలో ఏమాత్రం భద్రత కరువైంది. శ్రీవారి ఆలయం, తిరుమలవ్యాప్తంగా వేలాది సీసీ కెమెరాలు, ఆక్టోపస్, ఎస్పీఎఫ్, ఏపీఎస్పీ, సివిల్ పోలీసులు, టీటీడీ విజిలెన్స్ సిబ్బందితో నిరంతర నిఘా ఉన్నప్పటికీ, వేంకటాద్రి నిలయంలో మాత్రం రక్షణ లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. రూ.125 కోట్లతో 30 హాళ్లతో 5 వేల మంది భక్తులు బస చేసేలా నిర్మించిన ఈ అత్యాధునిక యాత్రికుల వసతి సముదాయం–5 (వేంకటాద్రి నిలయం)లో తగిన సంఖ్యలో సీసీ కెమెరాలు, ఇతర భద్రత ఏర్పాట్లు చేయకపోవడంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ భవనంలో నిత్యం వేలాదిమంది యాత్రికులు బస చేస్తున్నప్పటికీ, ప్రవేశ ద్వారం వద్ద మాత్రమే సీసీ కెమెరాలు ఉన్నాయి. హాళ్లు, కారిడార్లు వంటి కీలక ప్రాంతాల్లో నిఘా వ్యవస్థ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో రద్దీ రోజుల్లో భక్తుల సెల్ఫోన్లు, బ్యాగులు, నగదు చోరీకి గురవుతున్నాయంటూ ఫిర్యాదులు వస్తున్నట్లు సమాచారం. అయితే, సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు కష్టంగా మారుతోంది. ఈ వసతి సముదాయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులు పలుమార్లు టీటీడీని కోరినప్పటికీ, ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. భక్తుల రద్దీని, వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని అత్యవసరంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.


