గంగాధర నెల్లూరు: ‘పాల రైతులకు హెరిటేజ్ కుచ్చుటోపి’ శీర్షికన సాక్షి దినపత్రిక సోమవారం వార్త ప్రచురితమైంది. దీనిపై హెరిటేజ్ సంస్థ ప్రతినిధులు మండలంలోని నాసంపల్లి గ్రామానికి ఆదివారం చేరుకుని విచారణ చేపట్టారు. గ్రామంలోని డెయిరీ ఫార్మ్ నిర్వాహకులతో చర్చలు జరిపారు. గంగాధరనెల్లూరు మండలంలోని కలిజవేడు పంచాయతీ కే.నాసంపల్లి గ్రామంలో దాదాపు పది కుటుంబాలు 20 సంవత్సరాలుగా హెరిటేజ్ సంస్థ డెయిరీకి పాలు పోస్తున్నారు. గత రెండేళ్లుగా వెన్న శాతం అప్పుడప్పుడూ తగ్గుతోంది. ఇదే అదునుగా నాణ్యత తగ్గింద న్న సాకుతో ఆ రోజు పోసిన మొత్తం పాలను జీరో కింద పెట్టేసి జీరో పేమెంట్ లిస్టులో ఎక్కించారు. దీనిపై పాడి రైతులు గత శనివారం జీడీ నెల్లూరు మండలంలోని హెరిటేజ్ డెయిరీ వద్ద నిరసన తెలిపారు. ఈ విషయంపై సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితమైంది. హెరిటేజ్ సంస్థ జనరల్ మేనేజర్ సర్వోత్తమరెడ్డితో పాటు ప్రతినిధులు స్పందించారు. వెంటనే ఆదివారం ఉదయం కే.నాసంపల్లి గ్రామానికి చేరుకున్నారు. పాడి రైతులైన నీలావతి, ప్రభాకర్నాయుడు, దేవితో చర్చ లు జరిపారు. జీరో పాలసీ విధానాన్ని రద్దు చేస్తామని, గతంలో జీరో పాలసీ కింద వచ్చిన దానికి కూడా డబ్బు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. రైతులకు అండగా నిలిచిన ‘సాక్షి’కి పాడి రైతులు కృతజ్ఞతలు తెలిపారు.


